ఘనంగా తానా పితృ దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-23T23:32:23+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అంతర్జాతీయ పితృ దినోత్సవ వేడుకలను అంతర్జాలంలో ఘనంగా నిర్వహించింది. "ఘనుడు నాన్న త్యాగధనుడు

ఘనంగా తానా పితృ దినోత్సవ వేడుకలు

న్యూజెర్సీ: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అంతర్జాతీయ పితృ దినోత్సవ వేడుకలను అంతర్జాలంలో ఘనంగా నిర్వహించింది. "ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న" అనే అంశంపై తానా నిర్వహించిన ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం జరిగింది. తానా అధ్యక్షులు శ్రీ తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ "నాన్న నారికేళం వంటి వాడని పైకి కఠినంగా కనపడినా లోపల అనురాగం, అభిమానం అనే  తీయని కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఉంటాయని అన్నారు. అటువంటి నాన్న అనుభవాలను, అనుభూతులను అక్షరరూపంగా మలచడానికి, మనసులలో నాన్న జ్ఞాపకాలు నిక్షిప్తం చేయటానికి  ప్రపంచ స్థాయి కవితల పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలో ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఒమన్, బెహరైన్ వంటి దేశాలతో పాటు భారత్‌లోని తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్రతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 750  మంది పాల్గొని అద్భుతమైన కవితలు రాశారన్నారు. ఈ కార్యక్రమానికి అసాధారణమైన స్పందన లభించిందని తమ దృష్టిలో నాన్న మీద రాసిన ప్రతి కవితా ఉత్తమ కవితే కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కవికి ప్రశంసా పత్రాలను అందజేస్తున్నామని అన్నారు. కాగా.. ఈ పోటీలో ప్రథమ బహుమతి (రూ. 10,116) మౌనశ్రీ మల్లిక్, ద్వితీయ బహుమతి (రూ. 7,116) జయశ్రీ మువ్వా, తృతీయ బహుమతి (రూ. 5, 116) ప్రొ. రామ చంద్రమౌళి గెలుచుకొన్నారని తానా పూర్వ  అధ్యక్షులు డా. చౌదరి జంపాల అధికారికంగా ప్రకటించారు.  


మరోపక్క ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తండ్రులందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా భారత - చైనా సరిహద్దు సంఘర్షణలలో  వీరమరణం పొందిన సాటి తెలుగు వాడు కల్నల్ సంతోష్ బాబుతో సహా అసువులు బాసిన వీర సైనికులందరకూ నివాళులర్పించారు. "నాన్నా నీకు నమస్కారం" కార్యక్రమాన్ని ఆ సైనికుల త్యాగనిరతికి  అంకితం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీ తనికెళ్ళ భరణిలను డా. ప్రసాద్ తోటకూర సభకు పరిచయం చేశారు. పద్మశ్రీ  సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ.. నాన్న త్యాగాలు మరువలేనివని, నాన్న కంటే గొప్ప దైవం లేదని, నాన్న కేవలం పిల్లల్ని పెంచి ఇంటికే పరిమితమైన పాత్ర కాదని అన్నారు. నాన్నది సామాజిక బాధ్యత అని, ఒక గొప్ప బిడ్డను తయారు చేయడం, తద్వారా గొప్ప సమాజాన్ని నిర్మించగలగడం ఘనమైన నాన్న వ్యక్తిత్వంతోనే ముడిపడి  ఉంటుందన అన్నారు. కాబట్టి నాన్న ఉన్నతంగా, ఉత్తమంగా, నీతివంతంగా, ఆదర్శవంతంగా ఉండాలని తద్వారా ఉదాత్తమైన సమాజం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ప్రపంచస్థాయిలో నాన్న కవితల పోటీలు నిర్వహించినందుకు తానాను  ఆయన అభినందించారు. విజేతలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు


మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. నాన్న అనే అంశం పై  తానా వారు కవితల పోటీలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమైన విషయమని అన్నారు. తెలుగు భాషకు, సాహిత్యానికి తానా చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. భరణి తన నాన్నతో తమకున్న సంబంధాన్ని, తమ పెద్ద కుటుంబానికి ఏ లోటూ లేకుండా తండ్రిగా ఆయన పోషించిన పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. 


ఇక తానా ప్రపంచ కవితా పోటీల సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్.. నాన్న నీకు నమస్కారం లైవ్ కవిసమ్మేళనంలో పాల్గొని కవితలు చదివే అవకాశంతో పాటు ప్రశంసాపత్రాలు పొందిన వారి పేర్లను ప్రకటించారు. ప్రశంసా పత్రాలు పొందిన వారి పేర్లు.. శ్రీ రాపోలు సీతా రామరాజు (సౌత్ ఆఫ్రికా), శ్రీ అల్లాల రత్నాకర్ (బెహరైన్), శ్రీమతి కొప్పుల దివ్య ప్రశాంత్ (ఆస్ట్రేలియా), శ్రీ పంతుల కృష్ణ సుమంత్ (ఒమన్), డాక్టర్ నక్త వెంకట మనోహర రాజు  (అమెరికా), డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ ( హైదరాబాద్), శ్రీమతి  సీ. యమున (హైదరాబాద్), శ్రీ సిరాశ్రీ (హైదరాబాద్), శ్రీమతి మధురాంతకం మంజుల ( తమిళనాడు), శ్రీమతి పుష్పలత ( బెంగళూరు), శ్రీ సిద్దాంతపు ప్రభాకరాచార్యులు (అశ్వారావుపేట), డాక్టర్ అడిగొప్పుల శేషు ( భద్రాద్రి), శ్రీ చలపాక ప్రకాష్ ( విజయవాడ), శ్రీమతి రమాదేవి కులకర్ణి ( హైదరాబాద్), డాక్టర్. మురహర రావు ఉమా గాంధీ ( విశాఖపట్నం), శ్రీమతి చంద్ర కళ యలవర్తి ( అమెరికా), శ్రీ పుప్పాల కృష్ణ చంద్ర మౌళి  ఒరిస్సా), డాక్టర్ ఎమ్. సి.దాస్.( విజయవాడ), శ్రీ బండారి రాజ్ కుమార్ (వరంగల్), శ్రీ గూటం స్వామి (రాజమండ్రి), శ్రీమతి గట్టు రాధికా మోహన్ (హనుమకొండ), శ్రీ బొడ్డ కుర్మా రావు ( విశాఖపట్నం) అని ప్రకటించారు. మరో 41 మందికి విశిష్ట బహుమతులు, ప్రశంసాపత్రాలు లభించాయని, మరో 70 మందికి ప్రోత్సాహక ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని చిగురుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రాలను అందజేశామని అన్నారు. 


తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ శృంగవరపు వందన సమర్పణ చేస్తూ ఈ పోటీలకు డా. కె. గీత (అమెరికా), కిరణ్ ప్రభ (అమెరికా) న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని, ఈ కార్యక్రమానికి పోషక దాత "వెన్నం ఫౌండేషన్" చైర్మన్ మురళీ వెన్నం, తానా న్యూజెర్సీ కో ఆర్డినేటర్ శ్రీ రాజా కసుకుర్తి, సాంకేతిక సహకారం అందించిన బైట్ గ్రాఫ్ స్టుడియో అధినేత ప్రశాంత్‌కు, ప్రసారం చేసిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మంది వీక్షించారని, ఇది తెలుగు కవులలో నూతనోత్సాహాన్ని నింపిందని, కొన్ని వందల మంది  కవులకు ఏకకాలంలో ప్రపంచ సాహిత్య వేదికకు పరిచయం అయిన సంతృప్తి లభించిందని పలువురు కవులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-23T23:32:23+05:30 IST