షాపూర్‌నగర్‌లోని ఓ మార్కెట్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ బెదిరింపులు

ABN , First Publish Date - 2021-05-05T16:33:35+05:30 IST

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని బెదిరించి, షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో నిషేధిత గుట్కాప్యాకెట్‌లు విక్రయించే ఓ వ్యాపారి నుంచి రూ.50వేలు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌

షాపూర్‌నగర్‌లోని ఓ మార్కెట్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ బెదిరింపులు

గుట్కావ్యాపారి నుంచి రూ.50వేలు వసూలు 

ముగ్గురు వ్యక్తుల అరెస్ట్‌ 

నిందితుల్లో ఒకరు జైలు వార్డర్‌, మరొకరు ఏఆర్‌ కానిస్టేబుల్‌

హైదరాబాద్/జీడిమెట్ల: టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమని బెదిరించి, షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో నిషేధిత గుట్కాప్యాకెట్‌లు విక్రయించే ఓ వ్యాపారి నుంచి రూ.50వేలు వసూలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు, పోలీసులు కావడం విశేషం. షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో దినే‌ష్ కుమార్‌ మాలీ అనే వ్యాపారి కొన్ని సంవత్సరాల గుట్కా పాన్‌ మసాలా వ్యాపారం సాగిస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వం గుట్కాలను నిషేధించినా దినే‌ష్ కుమార్‌ అక్రమంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఇతడిపై జీడిమెట్ల పోలీస్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా జైల్లో వార్డర్‌గా పనిచేస్తున్న సికింద్రాబాద్‌ ప్రాంతంలోని వారాసిగూడకు చెందిన కానిస్టేబుల్‌. గౌనిసంతోష్‌(31), ఘట్‌కేసర్‌ ప్రాంతంలో నివాసముంటూ అంబర్‌పేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అమర్‌నాథ్‌(37), మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి మహ్మద్‌ ఇమ్రాన్‌(29) మఠాగా ఏర్పడ్డారు. వ్యాపారులను బెదిరించి రూ.లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలోనే షాపూర్‌నగర్‌ మార్కెట్‌లో నిషేధిత గుట్కా, పాన్‌ మసాలాలు విక్రయించే దినే‌ష్ కుమార్‌ వివరాలు తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రం అతడి షాప్‌నకు పాన్‌ మసాలా కావాలని సంతోష్‌ వెళ్లాడు. ఉన్నాయని చెప్పగానే మిగిలిన ఇద్దరు వచ్చి, తాము జీడిమెట్ల టాస్క్‌ఫోర్‌ పోలీసులమని బెదిరించారు. రూ.2లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో దినేష్‌ రూ.50వేలు ఇచ్చాడు. దినే‌ష్ కుమార్‌కు అనుమానం వచ్చి తనకు తెలిసిన పోలీసులకు ఫోన్‌ చేయగా జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-05T16:33:35+05:30 IST