ఎయిర్ ఇండియాపై టాటా కన్ను!
ABN , First Publish Date - 2020-08-15T06:24:54+05:30 IST
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే అంశంపై టాటా సన్స్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అధికారికంగా బిడ్ను దాఖలు...
- నెలాఖరుకల్లా బిడ్ దాఖలు చేసే అవకాశం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసే అంశంపై టాటా సన్స్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాను హస్తగతం చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అధికారికంగా బిడ్ను దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన వివిధ అంశాలను టాటా సన్స్ క్షుణ్ణంగా పరిశీలించే పనిలో ఉందని సమాచారం.
వ్యాపారపరమైన సమన్వయాలు, గిట్టుబాటు వ్యవహారాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. భారీ స్థాయిలో అప్పులు, నష్టాలతో నెట్టుకువస్తున్న ఎయి ర్ ఇండియాను ఎలాగైనా విక్రయించాలని ప్రభుత్వం నానాకష్టాలు పడుతోంది. ఇంతకు ముందుకు దీనికి సంబంధించి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ సంస్థలో పెట్టుబడులను ఉపసంహరించే ప్రక్రియను జనవరిలో ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎయిర్ ఇండియా కొనుగోలుకు మార్చి 17 వరకు బిడ్లను దాఖలు చేయాలని జనవరిలో ఈఓఐని జారీ చేశారు. స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. ఆ తర్వాత కూడా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో గడువును జూన్ 30కి పొడిగించారు. ఇప్పుడీ గడువు కాస్తా ఆగస్టు 31కి చేరుకుంది.