నేడు అరేబియాలో ‘తౌక్తే’ తుఫాన్!
ABN , First Publish Date - 2021-05-15T09:30:31+05:30 IST
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. లక్షద్వీప్ దక్షిణ నైరుతి దిశగా 80 కిలో మీటర్లు, కన్నూరు(కేరళ)కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలో మీటర్లలో దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
- రాత్రికి తీవ్ర తుఫాన్గా మారే చాన్స్
- నేడు, రేపు రాయలసీమకు వర్షసూచన
అమరావతి/విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. లక్షద్వీప్ దక్షిణ నైరుతి దిశగా 80 కిలో మీటర్లు, కన్నూరు(కేరళ)కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలో మీటర్లలో దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి వాయుగుండం బలపడి తుఫాన్గా మారనుందని పేర్కొంది. ఆ తర్వాత ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుఫాన్గా మారనుందని వెల్లడించింది. ఈ తుఫాన్కు ‘తౌక్తే’గా పేరు పెట్టనున్నారు.
ఈ నెల 18న ఉదయం గుజరాత్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గుజరాత్ తీరంలో గంటకు 150-160 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీ్పలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. కర్ణాటక, కేరళలో ఓ మోస్తరు వర్షాలు కురేసి అవకాశముంది. కాగా అరేబియాలో ఏర్పడిన వాయుగుండం రాయలసీమపై కొంతవరకూ ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని, కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. కాగా శుక్రవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.