గందరగోళంలో టీడీపీ కేడర్
ABN , First Publish Date - 2021-04-09T05:17:38+05:30 IST
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్తో పాటు మహాకూటమిలోని పార్టీలు హతాశులయ్యారు.
మెచ్చా నాగేశ్వరరావు నిర్ణయం పట్ల అసంతృప్తి
ఆందోళనలు నిర్వహించిన మహాకూటమి నాయకులు
అశ్వారావుపేట/దమ్మపేట/ గుండాల ఏప్రిల్ 8: ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్తో పాటు మహాకూటమిలోని పార్టీలు హతాశులయ్యారు. నియోజకవర్గంలోని పలువురు టీడీపీ సీనియర్ నాయకులు బుధవారం మధ్యాహ్నం వరకు ఎమ్మెల్యేతో కలసి ఉన్నప్పటికీ వారికి కనీస సమాచారం ఇవ్వలేదని సమాచారం. ఇప్పటి వరకు కలిసి ఉన్న తమకు కూడా కనీస స మాచారం ఇవ్వకపోవడంపట్ల ఏ విధంగా స్పందించాలో తెలియక తికమకపడుతున్నారు. కొందరు నాయకులు మా త్రం అందరూ పార్టీని వీడినప్పటికీ ఎమ్మెల్యేనే నమ్ముకొని పని చేస్తున్నామని, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే సమయంలో కనీసం సంప్రదించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం రెండు మూడురోజుల్లో సమావేశం ఏర్పాటు నిర్వహించి నిర్ణయం వెల్లడిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికలలో పోటా పోటీగా విమర్శలు చేసిన టీఆర్ఎస్ కేడర్తో సర్దుపోగలమా, తమకు సరైన గుర్తింపు లభిస్తుందా లేదా? ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిద్దామా? అనే చర్చలు అంతర్గతంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ టీడీపీ కేడర్ ఏం చేయాలనేదానిపై స్పష్టంగా లేరు. భవిష్యత్ ఏమిటనేదానిపై అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు మూడు రోజుల్లో టీడీపీ క్యాడర్లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరడం పట్ల గురువారం దమ్మపేటలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు మెచ్చా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా సీపీఐ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు, వీరబాబు, కాంగ్రెస్పార్టీ నాయకురాలు సున్నం నాగమణి, మద్దిశెట్టి సత్యప్రసాద్, కందుల వెంకటేశ్వరరావు, చిలకా శ్రీను, రాములు పాల్గొన్నారు.
మెచ్చా వల్ల టీడీపీకి లాభం లేదు, నష్టం లేదు
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారడం సమంజసం కాదని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీ డీపీ కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ సంధాని ఆరోపించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. స్వప్రయోజనాల కోసం పార్టీ మారడం దాన్ని నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి కోసం వేలుతున్నానని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. చంద్రబాబునాయుడు మెచ్చాను గుర్తించి టికెట్ ఇచ్చి గెలిపిస్తే, టీడీపీలోనే కొనసాగుతా నని తెలిపిన నాగేశ్వరావు ఈ రోజు పార్టీ ఫిరాయించడం సరైనది కాదని ఆరోపించారు.