బి ఫారాలన్నీ కలిపివ్వడానికి అనుమతి ఇవ్వాలి: టీడీపీ

ABN , First Publish Date - 2021-03-02T08:59:11+05:30 IST

ఒక జిల్లాలో లేదా ఒక మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి బి ఫారాలను కలిపి ఒకేసారి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించడానికి అనుమతి

బి ఫారాలన్నీ కలిపివ్వడానికి అనుమతి ఇవ్వాలి: టీడీపీ

అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఒక జిల్లాలో లేదా ఒక మునిసిపాలిటీలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి బి ఫారాలను కలిపి ఒకేసారి సంబంధిత ఎన్నికల అధికారికి సమర్పించడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు సోమవారం ఈ మేరకు ఎస్‌ఈసీకి లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలని చూసిన వైసీపీ నేతలు అందులో విఫలమైన చోట్ల ఇప్పుడు బి ఫారాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. తాము పోటీ చేస్తున్న చోట ఎన్నికల అధికారికి బి ఫారం ఇవ్వకుండా అడ్డుకోవడానికి... లేదా లాక్కొని చించి వేయడానికి పథక రచన చేస్తున్నారని, ఇది కూడా సాధ్యం కాకపోతే ఎన్నికల అధికారులను ఆకట్టుకొని వారి దగ్గరకు వచ్చిన బి ఫారాన్ని వారి చేతితోనే చించి వేయించాలని కూడా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి విరుగుడుగా మొత్తం అభ్యర్థులందరి బి ఫారాలు తాము ఒకేసారి జిల్లా ఎన్నికల అధికారికి లేదా మునిసిపాలిటీ ఎన్నికల అధికారికి సమర్పించాలని అనుకొంటున్నామని, దీనికి అనుమతించాలని అశోక్‌ బాబు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-03-02T08:59:11+05:30 IST