TDP అభ్యర్థి గెలుపు.. 2 గంటల తర్వాత ఒక్కసారిగా మారిన సీన్!

ABN , First Publish Date - 2021-11-17T18:41:52+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ పోరులో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది...

TDP అభ్యర్థి గెలుపు.. 2 గంటల తర్వాత ఒక్కసారిగా మారిన సీన్!

కృష్ణా జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ పోరులో అధికార వైసీపీ తన సత్తా చాటుకుంది. టీడీపీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో వైసీపీ పాగా వేయగా.. మంత్రులు స్వగ్రామం, నివాసముండే ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది. మరికొన్ని చోట్ల రీకౌంటింగ్ జరిపినా రెండోసారీ టీడీపీ అభ్యర్థే గెలవడం గమనార్హం. ఇంకొన్ని చోట్ల రీ కౌంటింగ్‌లో ఒకట్రెండు ఓట్ల తేడాతో వైసీపీ గెలిచిన స్థానాలు కూడా ఉన్నాయ్.


తాజాగా.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. నాలుగో వార్డు నుంచి టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. దీంతో అప్పటి వరకూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న వైసీపీ అభ్యర్థి దిగాలుగా ఇంటికెళ్లిపోయారు. అయితే ఇంటికెళ్లాక ఏం జరిగిందో.. ఎక్కడ్నుంచి ఫోన్‌లు వచ్చాయో తెలియట్లేదు కానీ.. రెండు గంటల తర్వాత కౌంటింగ్ కేంద్రం దగ్గరికొచ్చి హడావుడి మొదలుపెట్టారు. గెలిచింది టీడీపీ కాదు.. ఇదంతా తప్పుగా కౌంటింగ్ జరిగిందని.. మళ్లీ రీ కౌంటింగ్ నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేయసాగారు. ఆయన మాటలను స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ నేతలే తప్పుబట్టగా.. టీడీపీ నేతలు నవ్వుకున్నారట. రీ కౌంటింగ్‌పై మాత్రం ఉన్నతాధికారులు ఇంతవరకూ స్పందించనలేదు. చివరికి ఏం జరుగుతుందో ఏమో మరి.

Updated Date - 2021-11-17T18:41:52+05:30 IST