గుళ్లపై దాడుల వెనుక మత మార్పిడుల ఎజెండా!
ABN , First Publish Date - 2020-09-26T08:56:31+05:30 IST
వాలయాలపై దాడుల వెనుక మత మార్పిడుల ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడుల
ఓటు బ్యాంకు పెంచుకోవడానికే ఇదంతా
సింహాచలంతో దాడులు మొదలు..
తిరుమల వరకూ విస్తరించాయి
అచ్చెన్న, కొల్లుపై చూపిన శ్రద్ధ
వివేకా హత్యపై ఎందుకు లేదు?
మాస్కు లేదని యువకుడిని కొట్టిచంపారు
ఈ నిబంధన సీఎంకు వర్తించదా?
విశాఖపై ప్రేమ ఉన్నట్లు ‘రాజధాని’ కబుర్లు
కానీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ గాలికొదిలారు
జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): దేవాలయాలపై దాడుల వెనుక మత మార్పిడుల ఎజెండా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడుల వెనుక ఒక చీకటి ఎజెండా ఉందని.. మత మార్పిడులను పెంచి ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సింహాచలం నుంచి మొదలైన దాడులు తిరుమల వరకూ విస్తరించాయని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. ‘దేవాలయాల్లో సంప్రదాయాలను హేళన చేయడం, అపచారాలకు పాల్పడడం, భక్తుల మనోభావాలను గాయపరచడం వంటివి యథేచ్ఛగా చేస్తున్నారు.
ఆంజనేయ స్వామి విగ్రహం చేయి పోతే దేవుడికి ఏమవుతుంది..? రథం పోతే రథం చేయిస్తాం.. సింహాలు పోతే సింహాలు చేయిస్తామని మంత్రులు కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. భక్తులు నొచ్చుకొంటున్నారన్న కనీస జ్ఞానం కూడా లోపిస్తోంది. జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో గెలవగానే జెరూసలేం వెళ్లి వచ్చారు. నాకు వెంకటేశ్వరస్వామి అంటే భక్తి. ముస్లింలు అల్లాను పూజిస్తారు. మనకు ఉన్నట్లే ఎదుటివారికి కూడా నమ్మకాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. దేవాలయాల్లో ఇన్ని ఘటనలు జరిగితే ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదు’ అని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల వెంటపడి వెన్నాడి జైలుకు పంపారని, కానీ జగన్ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యకు గురైతే పట్టించుకున్న దిక్కు లేదని వ్యాఖ్యానించారు.
కేసులు వేసినవారిపై కక్ష
తన అవినీతిపై కేసులు వేసిన వారిని... ఆ కేసుల్లో వాదించిన వారిని లక్ష్యంగా చేసుకుని జగన్ కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘కేసులు వేసిన అశోక్ గజపతిరాజును మాన్సాస్ ట్రస్ట్ నుంచి తొలగించారు. ఎర్రన్నాయుడి తమ్ముడు అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు మోపి జైలుకు పంపారు. ఆ కేసులు వాదించినందుకు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివా్సపై కూడా కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారు... ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారు. మాస్క్ పెట్టుకోనందుకు చీరాలలో ఒక సామాన్య దళిత యువకుడిని పోలీసులు కొట్టి చంపారు. మాస్క్ నిబంధనలు సామాన్యులకు తప్ప ముఖ్యమంత్రికి వర్తించవా?’ అని విమర్శించారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు, గౌతు శిరీష మాట్లాడారు.