జగన్‌రెడ్డి ఖబడ్దార్: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-14T02:16:51+05:30 IST

జగన్ రెడ్డి ఖబడ్దార్ జాగ్రత్త అని టీడీపీ అధినేత చంద్రబాబు

జగన్‌రెడ్డి ఖబడ్దార్: చంద్రబాబు

 గుంటూరు: జగన్ రెడ్డి ఖబడ్దార్ జాగ్రత్త అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు గ్రామంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. చంద్రయ్య అంతిమయాత్రలో పాల్గొని పాడేను స్వయంగా చంద్రబాబు మోసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ జాగ్రత్తగా ఉండకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే  చంద్రయ్య ఆశయమన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటానికి నన్ను పిలవాలనుకుంటే చంద్రయ్య అంత్యక్రియలకు తాను రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు బరి తెగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్థులు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. 


చెంచాలతో మాట్లాడించటం కాదని.. జగన్‌కి దమ్ముంటే ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.  ఎమ్మెల్యే పిన్నెల్లి నంగనాచి అని ఆయన ఆరోపించారు.  పల్నాడు మీ తాత సొత్తు కాదన్నారు. బొండా ఉమపై దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. ఇక్కడ బ్రహ్మారెడ్డికి ఇంఛార్జ్ ఇస్తే ఎమ్మెల్యే కింద భూమి కంపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మాచర్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. చంద్రయ్యను చంపిన వారికి శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ తరపున 25 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు.ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు.  రెండేళ్ళు కావచ్చు.. ఏడాది కావచ్చు.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. హత్యా రాజకీయాలు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-01-14T02:16:51+05:30 IST