కరెంటు పోటుపై టీడీపీ భగ్గు
ABN , First Publish Date - 2020-05-22T09:49:44+05:30 IST
కరెంటు బిల్లులు గుట్టుగా అమాంతం పెంచటంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది.
ప్రజలపై భారం మోపిందంటూ ప్రభుత్వంపై మండిపాటు
పెంచిన చార్జీలు తగ్గించాలంటూ జిల్లావ్యాప్తంగా దీక్షలు
అనంతపురం వైద్యం/రామగిరి/పుట్టపర్తి/పెనుకొండ/మడకశిర టౌన్, మే21: కరెంటు బిల్లులు గుట్టుగా అమాంతం పెంచటంపై తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ముఖ్యమంత్రి నిర్ణయంపై తమ్ముళ్లు భగ్గుమన్నారు. ప్రజలపై భారం మోపటం ఏంటని ధ్వజమెత్తారు. పార్టీ ఆదేశాల మేరకు గురువారం జిల్లావ్యాప్తంగా విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ నిరసనలు చేపట్టింది.
వ్యాపార దృక్పథంతో జగన్
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురం నగరంలోని తన ఇంట్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నరసానాయుడు, జిల్లా ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడుతో నిరసన దీక్ష చేపట్టారు. కాలవ మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, ముఖ్యమంత్రి జగన్ వ్యాపార దృక్పథంతో ముందుకు సాగుతున్నారని దుయ్యబట్టారు. వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలనీ, పాత శ్లాబ్లలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
మధ్య తరగతి నడ్డి విరిచిన ప్రభుత్వం
లాక్డౌన్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి, పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచిందని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగిరి మండలం వెంకటాపురంలోని స్వగృహంలో పరిటాల సునీత, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్.. నిరసన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందిపోయి ఇష్టం వచ్చినట్లు పెంచుతూపోతే పేదలు ఎలా కడతారని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చే సిందన్నారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.