ఏ ముఖంపెట్టుకొని రైతుదినోత్సవాలు?: గోరంట్ల

ABN , First Publish Date - 2021-07-08T20:40:41+05:30 IST

రైతుల బతుకులను అంధకార బంధురం చేసిన జగన్ రెడ్డి, ఏ ముఖంపెట్టుకొని రైతుదినోత్సవాలుచేస్తున్నాడు? అంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఏ ముఖంపెట్టుకొని రైతుదినోత్సవాలు?: గోరంట్ల

రాజమహేంద్రవరం: రైతుల బతుకులను అంధకార బంధురం చేసిన జగన్ రెడ్డి, ఏ ముఖంపెట్టుకొని రైతుదినోత్సవాలుచేస్తున్నాడు? అంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం నాటి తన ప్రకటనలో ప్రభుత్వ విధానాలపై పలు విమర్శలు చేశారు. కేసీఆర్‌తో గతంలో ఆలింగనాలు చేసుకొని, ముద్దులుపెట్టిన ముఖ్యమంత్రి, కృష్ణా జలాల దుర్వినియోగంపై నేడు ఎందుకు నోరెత్తడంలేదని ప్రశ్నించారు. పంట కాలువలను సకాలంలో బాగుచేయడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు అందించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీనేతలే నకిలీ విత్తనాలు, పురుగుమందుల వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. 


జగన్ చెబుతున్న రైతుసంక్షేమం, సాక్షిలోని ఆర్భాటపు ప్రకటనల్లోనే కనిపిస్తోందన్నారు. రైతుకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం, సాక్షి పత్రికకు మాత్రం, సంక్షేమం పేరుతో కోట్ల రూపాయలు దోచిపెడుతోందన్నారు. అన్నదాతలు అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తక్కువఖర్చుతో సాగయ్యే సేంద్రియ విధానంపై రైతులంతా దృష్టిసారించాలన్నారు. రాబోయేరోజుల్లో రైతులను ఆదుకొని, వారికి అండగా నిలిచే ప్రభుత్వం వస్తుందన్నారు. అప్పటి వరకు వారంతా ధైర్యంగా ఉండాలని కోరారు. 

Updated Date - 2021-07-08T20:40:41+05:30 IST