రాష్ట్రంలో జరిగే అరాచకం సీఎం కళ్లకు కనిపించడం లేదా?: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-06-24T15:30:31+05:30 IST

నవ్యాంధ్రప్రదేశ్‌ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

రాష్ట్రంలో జరిగే అరాచకం సీఎం కళ్లకు కనిపించడం లేదా?: అచ్చెన్న

అమరావతి:  నవ్యాంధ్రప్రదేశ్‌ను వైసీపీ హత్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను వేధించడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అన్ని విధాలా అండగా వుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణలేదన్నారు. పరిశ్రమలతో కళకళలాడాల్సిన నవ్యాంధ్ర.. దాడులు, హత్యలతో విలవిల్లాడుతోందన్నారు. రాష్ట్రంలో జరిగే అరాచకం సీఎం కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. జర్మనీలో నాజీల దురాగతాలకు మించి ఏపీ జగన్ రెడ్డి అరాచకాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రోజులెప్పుడూ తమవే ఉండవని జగన్ రెడ్డి గూండాలు గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. అధికారంలోకొచ్చాక 27 మంది టీడీపీ కార్యకర్తలను బలితీసుకున్నారని మండిపడ్డారు. ఇన్ని హత్యలు, దాడుల జరుగుతున్నా డీజీపీ కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హత్యల్లో పాత్రులైన వారిలో ఒక్కరినైనా పట్టుకుని శిక్ష విధించారా అని నిలదీశారు. ఇష్టానుసారంగా తమ కార్యకర్తలపై దాడులకు తెగబడతామంటే చూస్తూ ఊరుకోమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2021-06-24T15:30:31+05:30 IST