టీడీపీకి పూర్వవైభవం తెస్తాం
ABN , First Publish Date - 2021-07-24T03:34:22+05:30 IST
కావలి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రూపులను ఏకం చేసి టీడీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, కావలి ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు.
కావలి ఇన్చార్జి అబ్దుల్ అజీజ్
కావలి, జూలై 23: కావలి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రూపులను ఏకం చేసి టీడీపీకి పూర్వవైభవం తెస్తామని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, కావలి ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. శుక్రవారం కావలికి వచ్చిన ఆయన పట్టణంలోని పలువురి నాయకులను కలసి పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం టీడీపీ డివిజన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కావలికి కొత్తనేతను నియమించే వరకు టీడీపీ క్యాడర్న్ కాపాడడమే కాకుండా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అధికారులు బాధ్యతలను మరచి అధికారపార్టీ నేతల కనుసన్నల్లో నడవడం వలన అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలో బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లితే వారిపైనే తిరిగి కేసులు పెట్టే పరిస్థితిలో ఉందన్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలు దోపిడీలు చూస్తే ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని చెప్పారు. టీడీపీలో హయాంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలపుడే రాజకీయాలు చేయాలి తప్ప అధికారం ఉన్నంత కాలం కాదన్నారు. రాజకీయ కక్షలు ఇలాగే కొనసాగితే తిరిగి అవే కాటేస్తాయన్నారు.
పలువురు నేతలను కలిసిన అజీజ్
కావలి : కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శుక్రవారం కావలికి వచ్చిన టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీకి చెందిన పలువురు నేతల ఇళ్లకు వెళ్లి వారిని కలిశారు. కావలిలో గ్రూపులు నిరోధించటంలో భాగంగా నేతలను కలిసినట్లు ఆయన చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు ప్రభాకర్ నాయుడును ఆయన నివాసంలో, గ్రంధి యానాదిశెట్టి, పోతుగంటి అలేఖ్యను గ్రంధి నివాసంలో కలిశారు. రైతు సంఘం నాయకుడైన బొట్లగుంట శ్రీహరినాయుడు, బాలకృష అభిమాన సంఘ నాయకుడు అన్నపూర్ణ శ్రీనును వారివారి నివాసాల్లో కలిసి పార్టీ పటిష్టతపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, ఖాజావలి, జలదంకి సుధాకర్, సాబీర్ఖాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
పోసిన శ్రీనివాసులుకు అజీజ్ పరామర్శ
కావలి రూరల్ : కావలి రూరల్ మండలం చెంచుగానిపాళెం టీడీపీ నాయకుడు పోసిన శ్రీనివాసులును శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఇంటికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర, మలిశెట్టి వెంకటేశ్వర్లు, కండ్లగుంట మధుబాబు నాయుడు, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, బొట్లగుంట శ్రీహరి నాయుడు, కాకి ప్రసాద్, యేగూరి చంద్రశేఖర్, కోసూరు వెంకటేశ్వర్లు, తటవర్తి వాసు, తుళ్లూరు మల్లి కార్జున్ తదితరులు పాల్గొన్నారు.