దాడి చేసిన వారిని వదిలి..బాధితులను అరెస్టు చేస్తారా!
ABN , First Publish Date - 2021-10-22T05:19:47+05:30 IST
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, వారి ఇళ్లపై దాడి చేసిన వారిని వదిలి బాధితులను అరెస్టు చేయడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం, అక్టోబరు 21: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, వారి ఇళ్లపై దాడి చేసిన వారిని వదిలి బాధితులను అరెస్టు చేయడంపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి చేసి 48గంటలు దాటుతున్నా ఇంతవరకూ బాధ్యులను అరెస్టు చేయలేదన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారిని వదిలి పట్టాభిని అరెస్టు చేయడం దారుణమన్నారు. దాడిలో నష్టపోయిన వారిని, పత్రికాముఖంగా దీనిని ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నతీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ లేదని, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. చివరకు కోర్టులను ఆశ్రయించడం మినహా గత్యంతరం లేదని చెప్పారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు తమ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ, మండలశాఖల అధ్యక్షులు రెడ్డెం బాస్కరరావు, సకుమళ్ల గంగాధర్, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు నల్లా శ్రీను, పెదిరెడ్ల నందిబాబు, కోళ్ల బంగారుబాబు, ఎలుబండి రాజారావు, నూతాటి ప్రకాష్ పాల్గొన్నారు.
చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ దీక్షలు
ప్రత్తిపాడు, అక్టోబరు 21: అమరావతిలో చంద్రబాబు చేపట్టిన 36గంటల దీక్షలకు మద్దతుగా గురువారం ప్రత్తిపాడులోని పార్టీ కార్యాలయంవద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు చేప ట్టారు. పార్టీ కార్యాలయాలపై దాడులుచేసిన వైసీపీ గూండాలపై వెంటనే చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ వరుపుల రాజా పిలుపు మేరకు దీక్షల్లో పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొమ్ముల కన్నబా బు, సీబీఎన్ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ళ జగదీష్, టీడీపీ నాయకులు జల్లిగంపల ప్రభాకరావు, రొంగల సూర్యారావు, జింకల తాతారావు, బొల్లు కొండబాబు, యిందన ఏసుబాబు, పళ్ళ గోపి, మిరియాల శ్రీను, ఇళ్ళ అప్పారావు, రావూరి తాతాజీ,పోలిశెట్టి శ్రీనివాస్, దొరబాబు, మదినేస్వామి పాల్గొన్నారు.
చంద్రబాబు దీక్షకు కృష్ణుడు సంఘీభావం
తుని, అక్టోబరు 21: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చంద్రబాబు చేపట్టిన దీక్షకు వెళ్లనీయకుండా కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు, తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు, ఇతర నేతలను బుధవారం రాత్రి ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల వ్యూహాన్ని ఊహించిన తుని నియోజకవర్గ ఇన్చార్జి యనమల కృష్ణుడు మంగళగిరి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు తుని ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు లోకేశ్ని కలిశారు.
టీడీపీ శ్రేణుల నిరశన దీక్ష
ఏలేశ్వరం: టీడీపీ నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులను నిరశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా గురువారం ఏలేశ్వరంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. కాకినాడ పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పైల సుభాష్చంద్రబోస్ ఆధ్వర్యంలో టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు రాయుడు చిన్నా, పెండ్ర శ్రీను, సతివాడ రాజేశ్వరరావు, పొట్నూరి అప్పారావు, సామంతుల తమ్మారావు, బూర్లు సురేష్, మజ్జి రాజు తదితర నాయకులు పాల్గొని దీక్ష చేపట్టి నిరశన తెలిపారు.