విశాఖలో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం బాధాకరం: Ayyanna

ABN , First Publish Date - 2021-10-04T16:53:49+05:30 IST

విశాఖపట్నంలో విలివైనటువంటి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం బాధాకరమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు.

విశాఖలో ప్రభుత్వ ఆస్తులు  తాకట్టు పెట్టడం బాధాకరం: Ayyanna

అమరావతి: విశాఖపట్నంలో విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం బాధాకరమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇవి ప్రజల ఆస్థులని.. తాకట్టు పెట్టడానికి వీళ్లకున్న అధికారం ఏంటని ప్రశ్నించారు. ఇది ఒక తుగ్లక్ నిర్ణయమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఇప్పటికే A2 విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఐటిఐ కాలేజి, పాలిటెక్నిక్ కాలేజి, సర్కూట్ హౌస్, తహశీల్దార్ కార్యాలయం, గోపాలపట్నం రైతు బజార్, పోలీసు క్వాటర్స్ ఇలా 13 విలువైన ప్రజల ఆస్తులను 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు.


ఈ నిర్ణయం తప్పని ఇప్పటికే విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ గారు కోర్టులో కేసు వేశారని తెలిపారు. ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉండగానే ఈ మూర్ఖులు తాకట్టు పెట్టేశారన్నారు. ‘‘మన మూడు జిల్లాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు మీరు మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి ఇది మంచి నిర్ణయమా...?... కొంత మంది దొంగలు ఎక్కడెక్కడ నుండో వచ్చి మన ప్రాంతంలో దోపిడీ చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నాం. వాళ్ళు మరో 2 సంవత్సరాల తరువాత పోతారు, కానీ నష్టపోయేది మన ప్రాంత ప్రజలు. కావున పార్టీలకు అతీతంగా మన ప్రాంత ఆస్తులను కాపాడుకోవాలి’’ అంటూ అయ్యన్నపాత్రుడు కోరారు. 

Updated Date - 2021-10-04T16:53:49+05:30 IST