మీరు మగాళ్లైతే బాబు దీక్ష ముగిసేలోపు రండి: Bonda uma

ABN , First Publish Date - 2021-10-21T19:16:24+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్ రావు అన్నారు.

మీరు మగాళ్లైతే బాబు దీక్ష ముగిసేలోపు రండి: Bonda uma

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్ రావు అన్నారు. 13 జిల్లాలలోని వైసీపీ ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ను, మాదకద్రవ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకున్నారని... ఇదే సంగతులను టీడీపీ బయటపెట్టిందని తెలిపారు. జె-బ్రాండ్లు కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. దేశం మొత్తానికి ఆంద్రాను డ్రగ్స్‌కు కేంద్రంగా మార్చారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమను చంపడానికి చూశారని...దేవుడి దయ వల్ల చావు అంచుల నుండి నాడు బయటపడ్డామని ఆయన తెలిపారు. తమపై మాచర్లలో దాడి చేసిన విషయం వాస్తవం అవునో కాదో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తమపై దాడి  చేసిన గూండాకు మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం పదవులు ఇస్తోందన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాలలో వైసీపీ నాయకుల మద్దతుతో గంజాయి పండిస్తున్నారని తెలిపారు. డబ్బు కోసం యువత భవిష్యత్తును వైసీపీ నాయకులు పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు పోరాటం చేస్తుంటే తమపై దాడి చేస్తున్నారన్నారు.  ఏపీ నుంచి వెళ్లే ప్రతీ కారును తెలంగాణ పోలీసులు తనీఖీలు చేస్తున్నారని.. దీనికి కారణం వైసీపీ నేతల డ్రగ్స్ వ్యాపారమే అని బోండా ఉమా చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారన్నారు. తెలంగాణ పోలీసులు ఏపీకి ఎందుకొచ్చారో డీజీపీ చెప్పగలరా అని ప్రశ్నించారు. దళిత నేత మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు నోటీసులు ఇస్తారా...ఇదేం బోషడీకే పాలన అని రాష్ట్రంలోని పేద ప్రజలు అంటూ ఉన్నారని అన్నారు. ‘‘ఎవరూ లేనపప్పుడు పోలీసుల అండతో దాడి చేయడం కాదు....మీరు మొగోళ్లు అయితే చంద్రబాబు నాయుడు దీక్ష ముగిసేలోపు రండి’’ అంటూ సవాల్ ఆయన విసిరారు.


గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా ఒక తప్పుచేయకుండా చంద్రబాబు నాయుడు పాలన చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళుతోందని చెప్పారు. ప్రమోషన్ల కోసం కక్కుర్తి పడి అధికారులు తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంపై చేసిన దాడిని రాష్ట్ర ప్రజలపై చేసిన దాడిగా చూస్తున్నామన్నారు. తప్పుడు కేసులకు తెలుగుదేశం బయపడదని బోండా ఉమా స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-21T19:16:24+05:30 IST