కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం: Chandrababu

ABN , First Publish Date - 2021-10-12T17:48:45+05:30 IST

రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గం: Chandrababu

అమరావతి: రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఆదేశించినా ఉపాధిహామీ బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన గుత్తే దారులపై కక్ష సాధింపులా అని నిలదీశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వేధించడం దుర్మార్గమన్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు, అభివృద్ధి పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రావడంలేదని అన్నారు. గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని న్యాయస్థానాలు ఎన్నిసార్లు ఆదేశించినా ప్రభుత్వం లెక్కలేనితనంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.


ఏలూరులో రంజిత్ అనే కాంట్రాక్టర్ కు బిల్లులు ఇవ్వకుండా వేధించడంతో ఆత్మహత్యాయత్నం చేశారని..రంజిత్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారన్నారు.  వారిని ఆర్థికంగా అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం హేయనీయమని వ్యాఖ్యానించారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సుమారు రూ.80 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని తెలిపారు. గుత్తేదారులెవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రతిపైసా అందే వరకు బాధితుల తరపున టీడీపీ పోరాటం చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-12T17:48:45+05:30 IST