సాయిరెడ్డి బర్త్డే గిఫ్ట్గా 307 కోట్లు సాగనంపారు: పట్టాభి
ABN , First Publish Date - 2020-07-01T17:16:35+05:30 IST
108, 104 అంబులెన్స్ల కొనుగోళ్లపై మరోసారి టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 108, 104 అంబులెన్స్ల కొనుగోళ్లలో 307 కోట్లు
విజయవాడ: 108, 104 అంబులెన్స్ల కొనుగోళ్లపై మరోసారి టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 108, 104 అంబులెన్స్ల కొనుగోళ్లలో 307 కోట్లు అక్రమాలు జరిగాయంటూ పట్టాభి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 307 కోట్లు విజయసాయిరెడ్డి ఇంటికి పంపించినట్లుగా వాహనాలను పంపించారని విమర్శించారు. అయినా విజయసాయిరెడ్డి బర్త్డే రోజునే 108, 104 వాహనాలను ప్రారంభించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి జన్మదినం సందర్భంగా అడ్డగోలుగా రూ.307 కోట్లు ఆయనకు కానుకగా ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ పథకాలను కాపీ కొట్టి కొత్తగా ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘వాస్తవాలను తొక్కిపెట్టి వందల కోట్లతో ప్రకటనలు ఇస్తారా?, చంద్రన్న సంచార ఆరోగ్య కేంద్రాలను మొబైల్ హాస్పిటల్స్గా చెప్పుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లో టూవీలర్ అంబులెన్స్లను నిలిపివేశారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లను ప్రవేశపెట్టింది చంద్రబాబే, గతంలో 104 అంబులెన్స్లో ఐదుగురు సిబ్బంది ఉంటే.. ప్రస్తుతం ముగ్గురికి తగ్గించారు. సరైన సిబ్బంది లేకుండా వైద్య పరీక్షలు ఎలా చేస్తారు?, అరబిందో ఫౌండేషన్కు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారు. పేదవాళ్ల ఆరోగ్యంతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి కోట్లు దోచిపెడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సమాధానం చెప్పాలి. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డాక్టర్కు రూ.లక్షా 80 వేలు చెల్లిస్తున్నారు. కొనుగోలు భారం అరబిందో ఫౌండేషన్ మీద పడకుండా 46 వస్తువులు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంట’’. ఇదేమీ విడ్డూరం అంటూ పట్టాభి నిలదీశారు.