రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: టీడీపీ నేత
ABN , First Publish Date - 2021-05-11T17:46:05+05:30 IST
రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేకపోతే రాష్ట్రం శవాల దిబ్బగా మారే ప్రమాదం ఉందని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని లేకపోతే రాష్ట్రం శవాల దిబ్బగా మారే ప్రమాదం ఉందని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డికి తన కమీషన్లు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి టీవీల్లో తప్ప ప్రజల్లో కనిపించటo లేదన్నారు. ఆక్సిజన్ అందక రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్, వైసీపీ నేతలు దొంగలని తెలిసి కూడా ప్రజలు ఒక అవకాశం ఇస్తే.. కుక్క తోక వంకర అన్నట్లు తమ బుద్ధి మార్చుకోకుండా కరోనా విపత్కర సమయంలోనూ ప్రజల ప్రాణాలు గాలికొదిలి కమీషన్లపై దృష్టి పెట్టడం దారుణమంటూ వీరాంజనేయస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.