దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారు: లోకేష్
ABN , First Publish Date - 2021-10-24T19:18:30+05:30 IST
ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహద్వారాన్ని
అమరావతి: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఇలవేల్పు, ఉత్కళాంధ్రుల ఆరాధ్యదైవం పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రధాన రహదారి వైపు ఉన్న ప్రహరీతో పాటు, ముందు సింహద్వారాన్ని కూల్చివేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థంలో రాముడి విగ్రహం తల ధ్వంసం, ఒకటేమిటి రెండున్నరేళ్ల జగన్ పాలనలో హిందూధర్మం మంటగలిసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లకి తీరని అపచారం తలపెట్టారన్నారు. రోడ్డు విస్తరణ పనుల పేరుతో అదే పాతపట్నంలో ఆంజనేయస్వామి, వినాయకగుడిలో విగ్రహాలు తరలించుకుంటామని వేడుకున్నా సమయం ఇవ్వకుండా బుల్డోజర్లతో కూల్చేయడం ప్రభుత్వ పెద్దలు హిందువుల ఆలయాల పట్ల ఎంత నిర్దయగా ఉన్నారో అర్థం అవుతోందని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేకు ఆలయాల ధ్వంసం సమాచారం ఇచ్చినా, పట్టించుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారంటే... ఇది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలకు తెలిసి చేసిన విధ్వంసమే అని లోకేష్ ఆరోపించారు.