రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్పై Lokesh స్పందన
ABN , First Publish Date - 2021-11-11T19:53:42+05:30 IST
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద రైతుల మహాపాదయాత్రలో పోలీసుల లాఠీఛార్జ్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని ఆయన తెలిపారు. పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా? అని ప్రశ్నించారు. హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో? అని నిలదీశారు. ఎండనక, వాననక ఏడుకొండలవాడి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలపడమూ నేరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవరేజ్కి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని ఎందుకు ఆపుతున్నారని అడిగారు. పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు.