అశోక్ మేరుపర్వతం...విజయసాయి అవినీతి అనకొండ!: సత్యనారాయణ
ABN , First Publish Date - 2021-06-18T16:07:45+05:30 IST
అశోక్ గజపతిపై విజయసాయి వ్యాఖ్యలు దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లుగా ఉందని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు.
అమరావతి: అశోక్ గజపతిపై విజయసాయి వ్యాఖ్యలు దొంగే దొంగ..దొంగ అని అరిచినట్లుగా ఉందని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు వ్యాఖ్యానించారు. 16నెలలు జైలు జీవితం గడిపి 18 కేసుల్లో ఎ2గా ఉన్న తమరా అశోక్ గజపతిని విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతి మేరుపర్వతం...విజయసాయి అవినీతి అనకొండ! అని అన్నారు. రాష్ట్రం కోసం కేంద్రమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించిన చరిత్ర ఆయనదని కొనియాడారు. వేలకోట్లు దోచుకుని దొడ్డిదారిన రాజ్యసభకు వెళ్లిన చరిత్ర విజయసాయిదని అన్నారు. విజయవాడ కనకనదుర్గమ్మ గుడిని నిలువు దోపిడీ చేసిన చరిత్ర మంత్రి వెల్లంపల్లిదని ఆయన విమర్శించారు.
వెల్లంపల్లి వార్డుమెంబర్కు ఎక్కువ...కౌన్సిలర్కు తక్కువ అని యెద్దేవా చేశారు. హైకోర్టు ఉత్తర్వులను దొడ్డిదారి అనడమంటే న్యాయస్థానాన్ని అగౌరవపర్చడమే అని అన్నారు. 166 సార్లు కోర్టుతో మొట్టికాయలు తిన్న తమకు కోర్టు ఉత్తర్వులు కోపం తెప్పించడం సహజమే అని అన్నారు. అప్పన్న భూముల కోసం వేసిన మాస్టర్ ప్లాన్ విఫలం కావడంవల్లే అశోక్ గజపతిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకోసం వేలకోట్ల ఆస్తులు త్యాగం చేసిన చరిత్ర అశోక్ గజపతిరాజుదని...వేలకోట్ల ప్రజాధనాన్ని దోచుకుని జైలుకెళ్లిన చరిత్ర విజయసాయిదన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాలని, లేకపోతే ప్రజాకోర్టుతో పాటు భగవంతుడి కోర్టులోనూ తమకు శిక్ష తప్పదని మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు.