వైసీపీ నాయకులకు ఎందుకంత భయం‌: లోకేష్

ABN , First Publish Date - 2021-08-12T23:49:21+05:30 IST

జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల నెల్లూరులో ఆత్మహత్య

వైసీపీ నాయకులకు ఎందుకంత భయం‌: లోకేష్

నెల్లూరు: జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. ఇటీవల నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు కమల్‌కి లోకేష్, జిల్లా టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ  తాను పరామర్శకి వస్తుంటే వైసీపీ నాయకులకు ఎందుకంత భయమన్నారు. అధికారులు, మంత్రి, వైసీపీ నాయకులు కలిసి కమల్ కుటుంబాన్ని మాయం చేసారని ఆరోపించారు. రాత్రి వరకూ తమ కుటుంబానికి కలిగిన కష్టం ఇంకెవరికి కలగకూడదని, ఇంకో కుర్రాడు ఆత్మహత్య చేసుకోకూడదు అని బాధపడిన కమల్ కుటుంబాన్ని రాత్రికి రాత్రే మాయం చెయ్యడం దారుణమన్నారు. కమల్ కుటుంబాన్ని మాయం చేసిన వైసీపీ నాయకులు చనిపోయిన కమల్‌ని తిరిగి తీసుకురాగలరా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయకులు పిరికివాళ్లని, అందుకే కమల్ కుటుంబాన్ని మాయం చేసారన్నారు. తాను పరామర్శకి వస్తే నిజాలు బయటపడతాయని వైసీపీ నాయకులు భయపడుతున్నారని ఆయన ఆరోపించారు.


 ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటర్నేషనల్ యూత్ డే జరుపుకుంటుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగ యువకుల కుటుంబాలను పరామర్శించాల్సిన పరిస్థితి ఉందన్నారు. యువతకి ఉన్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి ఇంటర్నేషనల్ యూత్ డే ఒక గొప్ప అవకాశమన్నారు. కానీ మన రాష్ట్రంలో సమస్యలు చెప్పుకుందామటే వినే నాథుడే లేడన్నారు.  నిరుద్యోగ సమస్యతో రాష్ట్రంలో ఉన్న యువకులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారంలోకి రాగానే ఫ్యాన్ గిర్రున తిప్పి 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఎన్నికల ముందు జగన్ రెడ్డి అన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే ఫ్యాన్‌కి నిరుద్యోగులు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-12T23:49:21+05:30 IST