అమరావతి ఉద్యమం సాగిస్తున్న అతివలకు పాదాభివందనం: నిమ్మల

ABN , First Publish Date - 2020-12-04T19:48:24+05:30 IST

రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలకు టీడీపీ నేత నిమ్మల రామానాయుడు సంఘీభావం తెలిపారు.

అమరావతి ఉద్యమం సాగిస్తున్న అతివలకు పాదాభివందనం: నిమ్మల

అమరావతి: రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలకు టీడీపీ నేత నిమ్మల రామానాయుడు సంఘీభావం తెలిపారు. శుక్రవారం మందడం శిబిరానికి చేరుకున్న నిమ్మల... 353 రోజులుగా అమరావతి ఉద్యమం సాగిస్తున్న అతివలకు అభినందనలు తెలిపారు. భూములు ఇచ్చి... బజారుకెక్కినా.. భయపడకుండా పోరాడుతున్న మహిళలకు పాదాభివందనం అని ఆయన అన్నారు. రైతులకు సంకెళ్లు వేసినా... మహిళలను అరెస్టు చేసినా వెనకడుగు వేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అని అన్నాడని... అమరావతిని అభివృద్ధి చేస్తానని నమ్మబలికారని మండిపడ్డారు.




గద్దెనెక్కగానే మాట తప్పి, మడమ తిప్పారని విమర్శించారు. మాయ మాటలతో ఓట్లు వేయించుకుని.. ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రైతులు, మహిళల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని... కానీ జగన్ తన స్వార్ధం కోసం ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే.. ఆదర్శ రాజధానిగా నిలిచేదన్నారు. ఎవరూ అధైర్యపడవద్దని... ఎన్ని కుట్రలు చేసినా అమరావతే రాజధాని అని స్పష్టం చేశారు. ఇక్కడ మహిళల పోరాటం దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందని అన్నారు. అమరావతి ఉద్యమం‌ న్యాయమైనదని...తాము అండగా ఉంటామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-04T19:48:24+05:30 IST