జగన్ దిగిపోతేనే నిజమైన సంక్రాంతి: పిల్లి మాణిక్యరావు
ABN , First Publish Date - 2022-01-12T21:50:33+05:30 IST
అధికారంలో నుంచి సీఎం జగన్ రెడ్డి దిగిపోతేనే తమకు
అమరావతి: అధికారంలో నుంచి సీఎం జగన్ రెడ్డి దిగిపోతేనే తమకు నిజమైన సంక్రాంతి అని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడారు. ధరలు దిగిరావాలి-జగన్ రెడ్డి దిగిపోవాలి అన్న టీడీపీ నిరసన కార్యక్రమాలు భారీస్థాయిలో విజయవంతమయ్యాయన్నారు. ప్రతిపక్షంలోఉన్నప్పుడు ధరలపై గొంతుచించుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడేం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. సంక్రాంతి పండుగతో కళకళలాడాల్సిన రైతుల లోగిళ్లు ఉసూరుమంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దిగిపోతేనే తమకు నిజమైన సంక్రాంతి అని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి పాదప్రభావంతో మూడు సంక్రాంతులకు ప్రజలు దూరమయ్యారన్నారు. ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చీ రాగానే కరోనాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని ఆయన ఆరోపించారు. కరోనాను అంతంచేస్తానని చెప్పిన పెద్ద మనిషి కొడాలి నానీకి కరోనా రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, ప్రభుత్వం వేస్తున్నపన్నులతో ప్రజల ముఖాల్లో పండుగ సంతోషం కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో నెలకు సరిపడా సరుకులు కొనే పరిస్థితి లేదని ఆయన అన్నారు.