ఎంపీ గారూ.. మీ సొంత గ్రామానికి రోడ్డు వేశారా?

ABN , First Publish Date - 2021-08-23T23:03:36+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చేసిన విమర్శలపై

ఎంపీ గారూ.. మీ సొంత గ్రామానికి రోడ్డు వేశారా?

ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చేసిన విమర్శలపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు తీవ్రంగా స్పందించారు. "ఎంపీ గారూ.. మీ సొంత గ్రామానికి రోడ్డు వేశారా"? అని ఎంపీ శ్రీధర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్కరోడ్డు కూడా చంద్రబాబు వేయలేదని చెప్పడం ఏలూరు ఎంపీ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో 24వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు, అనేక రోడ్ల నిర్మాణాలను చంద్రబాబు పూర్తి చేసారన్నారు. నరేగా బిల్లులు చెల్లించట్లేదని వైసీపీ ప్రభుత్వానికి కోర్టులు గట్టిగా మొట్టికాయలు వేస్తున్న విషయాలు ఎంపీ దృష్టికి రావట్లేదా అని ఆయన ప్రశ్నించారు. "మీ సొంతవూరు వెళ్ళటానికి సరైన రోడ్డు లేక మీరు చుట్టూ తిరిగి వెళ్తున్న విషయం ముందు తెలుసుకొండి ఎంపీ గారు" అని ఆయన ఎద్దేవా చేశారు. రెండున్నర సంవత్సరాలుగా తన సొంత గ్రామానికి వెళ్ళటానికి రోడ్డు వేయించుకోలేని ఎంపీ శ్రీధర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.


"అవును, ఎంతైనా మీరు వలస నేత కదా" అని ఎంపీ శ్రీధర్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. "ఆరు నెలలు ఇక్కడ, ఆరు నెలలు అమెరికాలో ఉంటారు కాబట్టే, మీకు అన్నీ తెలుసు అనుకోవడం ప్రజల మూర్ఖత్వం అవుతుంది". అని ఎంపీ శ్రీధర్‌ను ఉద్దేశించి శ్యామ్ చంద్ర వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-08-23T23:03:36+05:30 IST