వివేకా ఆత్మ రాజప్రసాదం చుట్టూ తిరుగుతోంది
ABN , First Publish Date - 2021-04-13T20:22:02+05:30 IST
తనను ఎవరు చంపారో తెలియక వివేకా ఆత్మ రాజప్రాసాదం చుట్టూ తిరుగుతోందని టీడీపీ అధికార
అమరావతి: తనను ఎవరు చంపారో తెలియక వివేకా ఆత్మ రాజప్రసాదం చుట్టూ తిరుగుతోందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. వివేకా హత్యకేసు విచారణలో సునీతమ్మ చేసిన ఆరోపణలపై సీబీఐ ఎందుకు దృష్టి సారించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు అనుమానితులను వదిలేసి పూలు, పాలు, పండ్లు అమ్మేవారిని విచారిస్తే ఏం లాభమని ఆయన అన్నారు. శవానికి ఎవరు కుట్లువేశారో, ఎవరి ప్రయోజనాల కోసం వేశారో సీబీఐ ఎందుకు తేల్చలేదని ఆయన ప్రశ్నించారు.
వివేకా హత్య కేసుతో తనకు సంబంధముందని నిరూపిస్తే, ఉరేసుకుంటానని ఆదినారాయణ రెడ్డి చెప్పారని ఆయన పేర్కొన్నారు. మరి అటువంటపుడు హత్యతో తమకు సంబంధం లేదని వై.ఎస్. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. వారి చేతికి అంటిన రక్తాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత వారిద్దరిపై లేదా అని ఆయన నిలదీశారు. వివేకా హత్య కేసులో అన్నివేళ్లు జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిల వైపే చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.