క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం: Yanamala
ABN , First Publish Date - 2021-08-26T19:10:12+05:30 IST
సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీం పూనుకోవడం శుభపరిణామమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి: సీబీఐ, ఈడీ కేసుల సత్వర విచారణకు సుప్రీం పూనుకోవడం శుభపరిణామమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో నేరస్తుల్ని నిలువరించినప్పుడే అసలైన ప్రజాస్వామ్యమన్నారు. క్రిమినల్ కేసుల్లో విచారణ జాప్యం ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే ఆదర్శవంతమైన సమాజాన్ని అందించగలమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 138 సీబీఐ, ఈడీ కేసులు దశాబ్ద కాలంగా పెండింగులో ఉన్నాయన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు తమ ప్రజాప్రతినిధి అక్రమాలు తెలియాల్సిందే అని స్పష్టం చేశారు. అప్పుడే చట్ట సభల్లోకి నేరస్తులు, ఆర్ధిక ఉగ్రవాదులు రాకుండా అడ్డుకోగలమన్నారు. అమికస్ క్యూరీ సూచన మేరకు విచారణ పర్యవేక్షణకు కమిటీ వేయాలని తెలిపారు. రాజకీయాల్లోకి నేరస్తుల్ని నిరోధించినప్పుడే ప్రజా సంపదను కాపాడగలమని చెప్పారు. నేరస్తులు లేని రాజకీయాలతోనే రాజకీయ-ఆర్ధిక-సామాజిక అసమానతల నివారణ అని అన్నారు. చట్టం సామాన్యులకు ఒకలా.. రాజకీయ నేరస్తులకు ఒకలా తయారైందని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.