అలా లేకుంటే అసెంబ్లీ పెట్టేవారు కాదేమో:Yanamala
ABN , First Publish Date - 2021-11-17T17:58:54+05:30 IST
అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని... ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదేమో
అమరావతి: అసెంబ్లీ నిర్వహించాలని రాజ్యాంగం గుర్తు చేసిందని... ఆరునెలలకు ఒసారైనా అసెంబ్లీ పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో లేకపోతే అది కూడా పెట్టేవారు కాదేమో అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్లమెంట్కు మరే ఇతర రాష్ట్రాలకు లేని కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వానికే వర్తిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఒక్కరోజు అసెంబ్లీతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. 14 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టి ఎలాంటి చర్చా లేకుండా ఆమోదింపచేసుకోవటం వల్ల ప్రజలకు ఏం ఉపయోగమని నిలదీశారు. బాధ్యతల నుంచి పారిపోయేలా జగన్ రెడ్డి విధానాలు ఉన్నాయన్నారు. రాజ్యాంగం, నిబంధనలు పక్కనపెట్టి రాజకీయ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మళ్లీ అధికారంలోకి జగన్ రాకపోయినా, ప్రస్తుతం సీఎంగా రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీశారన్నారు. స్వయంకృతాపరాధాన్ని కోవిడ్ మీద నెట్టి తప్పించుకునే యత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ రెడ్డి తప్పుడు నిర్ణయాల వల్ల సమాజంలోని ప్రతీ వర్గం ఇబ్బంది పడుతోందన్నారు. భవిష్యత్తులో ఇక అప్పులు కూడా దొరకని విధంగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.