టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గం: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-08-16T20:09:19+05:30 IST
పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
అమరావతి: పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. వారు చేసిన తప్పేంటి? ఎందుకు అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయమని కోరడమే వారు చేసిన తప్పా అని నిలదీశారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఉపయోగపడని పోలీస్ వ్యవస్థ.. టీడీపీ నేతలను అరెస్ట్ చేయడంలో మాత్రం సమర్ధవంతంగా పనిచేస్తోందని తప్పుబట్టారు. సీఎం జగన్ ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే రమ్య కుటుంబానికి న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని అచ్చెన్నాయడు చెప్పారు.
విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యుల పరామర్శలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటికల్ కెరీర్లో తొలిసారిగా అరెస్టయ్యారు. లోకేష్తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు.