ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-01-24T06:03:44+05:30 IST
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.
నల్లజర్ల, జనవరి 23: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పు చోడవరంలో ఆదివారం గౌరవ సభ నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేయవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమని వారితో శాంతియుత చర్చలు జరిపి సమర్థవంతమైన పాలన అందించాలన్నారు. గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యలపై స్థానిక నాయకులు పోరాడాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, ఉపాధ్యక్షుడు గుదే సుబ్బారావు, కెంగం శ్రీను, సర్పంచ్ సంఖవరపు వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ ఉండవల్లి గోపాలకృష్ణ, కూచిపూడి ఉదయ భాస్కర్, జాలపర్తి భార్గవ్, ఉప్పు నరేష్, సవలం రామకృష్ణ పాల్గొన్నారు.
పోరాటానికి ఫ్యాప్టో సిద్ధం
కామవరపుకోట: పీఆర్సీ, హెచ్ఆర్ఏ సమస్యలపై పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేసే పోరాటానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు కామవరపుకోట మండల ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. ఆదివారం వారు మాట్లాడుతూ 25న ఏలూరులో కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో తాము పాల్గొంటామన్నారు. 26న స్థానికంగా అంబేడ్కర్ విగ్రహానికి తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తామన్నారు. 27, 28, 29, 30 తేదీల్లో ఏలూరులో జరిగే రిలే నిరాహార దీక్షల్లో తమ సభ్యులు పాల్గొంటారని ఫ్యాప్టో ప్రతినిధులు ప్రకటించారు.