వలంటీర్ల దుర్వినియోగంపై విచారణ జరపండి
ABN , First Publish Date - 2021-04-11T09:20:34+05:30 IST
తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికలో అధికార పక్షం వైసీపీ గ్రామ, వార్డు వలంటీర్లను దుర్వినియోగం చేయడంపై విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ తటస్థ పరిశీలకులను నియమించండి
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ లేఖ
అమరావతి, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికలో అధికార పక్షం వైసీపీ గ్రామ, వార్డు వలంటీర్లను దుర్వినియోగం చేయడంపై విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు టీడీపీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు పంపారు. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం, రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కలిసి సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలంలో నిర్వహించిన వలంటీర్ల సమావేశంపై పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగుల ను ఈ ఫిర్యాదుకు జత చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకొంటున్న వలంటీర్లను తమ పార్టీ ప్రచారానికి వాడుకోవాలని వైసీపీ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని లేఖ లో పేర్కొన్నారు. అదేవిధంగా.. టీటీడీ ప్రధాన అర్చకునిగా రమణ దీక్షితులు నియామకం ఆపాలని వర్ల రామయ్య మరో లేఖను ఈసీకి పంపారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ నెల 2న ఈ నియామకం జరిపారని, ఎన్నిక జరుగుతున్న చోట ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో జరిపిన ఈ నియామకాన్ని రద్దు చేయాలని అందులో కోరారు. టీడీపీ కార్యక్రమాల కమిటీ కార్యదర్శి మద్దిపాటి వెంకట రాజు ఓ లేఖను ఈసీకి పంపారు. తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబం ధం లేని తటస్థ పరిశీలకులను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సూక్ష్మ ఎన్నికల పరిశీలకులను నియమించి గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయకుండా వీరి ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పారా మిలటరీ దళాలను నియమించాలని విజ్ఞప్తి చేశారు.