వరుస విపత్తుల్లో ప్రజలకేదీ సాయం?
ABN , First Publish Date - 2020-10-16T09:00:51+05:30 IST
ఏడాదిన్నరగా వరుస విపత్తులు వచ్చి పడుతున్నా ప్రభుత్వపరంగా ప్రజలకు పెద్దగాసాయం అందడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.
జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు: చంద్రబాబు
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నరగా వరుస విపత్తులు వచ్చి పడుతున్నా ప్రభుత్వపరంగా ప్రజలకు పెద్దగాసాయం అందడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద బాధిత జిల్లాల పార్టీ నేతలతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వరుస విపత్తుల్లో రైతులు అందరికంటే ఎక్కువగా నష్టపోయారని, వారికి జరిగిన నష్టాన్ని భర్తీచేసేలా ప్రభుత్వం నుంచి సాయం లేదన్నారు. చేతివృత్తులవారు, ఇళ్ళు దెబ్బతిని పేదలు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని విమర్శించారు. ‘‘సకాలంలో నీటిని కిందకు విడుదల చేయకుండా అమరావతిని ముంచడమే ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించారు. జలాశయాల నీటి నిర్వహణలోనూ కక్ష సాధింపు యోచనలకు పూనుకోవడం అమానుషం’’ అని చంద్రబాబు మండిపడ్డారు. కాగా, వరదల తాకిడికి రైతులు కన్నీళ్ళలో మునిగి తేలుతుంటే వైసీపీ నేతలు ఇళ్లలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు.