అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధం

ABN , First Publish Date - 2021-10-18T06:09:18+05:30 IST

అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధం

అవినీతిని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
విలేకరులతో మాట్లాడుత్ను టీడీపీ నేతలు

 బినామీ పేర్లతో సంపాదించేది ఎవరో అందరికీ తెలుసు..బహిరంగ చర్చకు రండి 

సీఎం ప్రోగ్రాం కన్వీనర్‌ తలశిల రఘురాం విమర్శలను తిప్పికొట్టిన టీడీపీ నేతలు

గొల్లపూడి, అక్టోబరు 17: గొల్లపూడి గ్రామంలో టీడీపీ హయాంలో రూ.200 కోట్లు అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని, తామందరం రాజకీయాలకు స్వస్తి చెపుతామని టీడీపీ నేతలు నూతులపాటి వెంకటేశ్వరరావు, నర్రా వాసు అన్నారు. ఆదివారం వైఎస్సార్‌ ఆసరా పథకం కార్యక్రమంలో సీఎం ప్రొగ్రాం కన్వీనర్‌ తలశిల రఘురాం మాట్లాడుతూ టీడీపీ హయాంలో గ్రామంలో రూ.200 కోట్లు అవినీతి జరిగిందని అందుకు బాధ్యులైన వారిని త్వరలో జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈవ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. తలశిల రఘురాం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చలామణి అవ్వడం తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదన్నారు. బినామీల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించేది ఎవరో అధికారంలోకి వచ్చాక గ్రామంలో కోట్ల రూపాయలతో స్థలాలు, లక్షల రూపాయల కార్లు కొంటుంది ఎవరో గ్రామస్థులకు తెలుసునన్నారు. ఒకప్పుడు నీకు రాజకీయ భిక్ష పెట్టింది నువ్వు దూషించే పెద్దేనన్న విషయం మరువడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాచలం ప్రాంతం నుంచి వచ్చిన నువ్వు ఎలా స్థానికుడివో నిరూపించాలన్నారు. బతుకు దెరువుకు హైదరాబాద్‌ వెళ్లిన సంగతి మర్చిపోయావా అని రఘురాంను ప్రశ్నించారు. 1989-90లో గ్రామం విడిచి పలాయనం చిత్తగించి, ఎన్టీఆర్‌ ఘాట్‌లో చెప్పుల స్టాండ్‌ను రూ.5 వేలకు అద్దెకు ఇచ్చిన నీకు ఇంత సంపద ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా టీడీపీ హయాంలో అన్యాక్రాంతం కాలేదన్నారు. టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్లు నిరూపించేందుకు బహిరంగ చర్చకు రావాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్‌ విసిరారు. చంద్రబాబు, దేవినేని ఉమాను తిట్టేందుకే వైసీపీ నేతలు మంత్రులను గ్రామాల్లోకి తీసుకువస్తున్నారన్నారు. టీడీపీ నేతలు రంగినేని నరేంద్ర, వడ్లమూడి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T06:09:18+05:30 IST