ఉద్యోగుల జీతాల తగ్గింపు తొలిసారి
ABN , First Publish Date - 2022-01-22T05:15:22+05:30 IST
ఉద్యోగులకు జీతాలు పెంచే వారిని చూశాం కానీ, తగ్గించటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారని టీడీపీ పశ్చిమ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.
గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు జీతాలు పెంచే వారిని చూశాం కానీ, తగ్గించటం తన రాజకీయ జీవితంలో ఇదే మొదటిసారని టీడీపీ పశ్చిమ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన గుంటూరులోని తన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ, ఫిట్మెంట్, ఐఆర్, హెచ్ఆర్ఈలను టీడీపీ హయాంలో పెంచామన్నారు. కానీ జగన్ ప్రభుత్వం పెంచడం మాట అటుంచి పాత జీతాల్లో కోత పెట్టటం దారుణమన్నారు. రాష్ట్రంలో మోస పూరిత ప్రభుత్వం నడుస్తోందనడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. మధ్యంతర భృతికన్నా తక్కువ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర జగన్కే దక్కుతుందన్నారు.
విష సంస్కృతికి కొడాలి బీజం
దివాలా దిశ అంచున ఉన్న ఏపీలో విష సంస్కృతికి మంత్రి కొడాలి నాని బీజం వేశారని రవీంద్ర తెలిపారు. తమ పార్టీ నేతలకు దోచిపెడుతూ ప్రజాధనాన్ని ప్రభుత్వం యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. సంక్రాంతి ముసుగులో జూదంతో దాదాపు రూ.250 కోట్లు దోచుకొని నేడు చాలెంజ్లు చేస్తున్న కొడాలి నాని నిజనిర్ధారణ అంటే ఎందుకు ఇంతలా ఉలిక్కిపడుతున్నారని నిలదీశారు. ఇప్పటికే గంజాయికి కేరాఫ్గా ఏపీని మార్చిన ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్ఠను మరింతలా దిగజారుస్తుందని కోవెలమూడి విమర్శించారు.