టీడీపీ.. టీం
ABN , First Publish Date - 2021-03-03T05:18:02+05:30 IST
గుం టూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించింది. మొత్తం 57 డివిజన్లకు 55 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.
కార్పొరేటర్ అభ్యర్థుల జాబితా సిద్ధం
29, 48 డివిజన్ల బీ ఫారాలు పెండింగ్
పొత్తులో సీపీఐకి 8, 15 డివిజన్ల కేటాయింపు
గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): గుం టూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టీడీపీ ప్రకటించింది. మొత్తం 57 డివిజన్లకు 55 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ గల్లా జయదేవ్, గుంటూరు పార్ల మెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, తూర్పు, పశ్చిమ, ప్రత్తి పాడు ఇన్చార్జిలు మహ్మద్ నసీర్, కోవెలమూడి రవీంద్ర, డాక్టర్ మాకినేని పెదరత్తయలు పలు మార్లు సమావేశమయ్యారు. అనంతరం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేశారు. కార్పొ రేటర్ సీటును ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు గత ఏడాది నామినేషన్లు వేశారు. దీనిపై ప్రస్తుతం అధిష్ఠానం దృష్టి సారించింది. బుధవారంతో నామి నేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో ఆశా వాహులను మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి పిలిపించిన నాయకులు వారితో చర్చించారు. రెబల్స్గా బరిలో ఉన్న అభ్యర్థులను ఎంపీ గల్లా జయదేవ్ తన కార్యాలయానికి పిలిపించుకొని సోమవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. వారి చేత నామినేషన్లు ఉప సంహరించుకునేలా ఒప్పించారు. అనం తరం పోటీలో ఉండాల్సిన అభ్య ర్థుల జాబితాను సిద్ధం చేశారు. డివిజన్లలో పోటీలో ఉన్న వారికి ’బీ’ఫాంలు అందజేశారు. పొత్తులో భాగంగా తూర్పు నియోజకవర్గంలోని 8, 15 వార్డులను సీపీఐకి కేటాయించారు. 29, 48 డివిజన్లపై ఇంకా సంగ్ధిదత వీడలేదు. 48వ వార్డుకు కృష్ణారెడ్డి అనే అభ్యర్థి నామినేషన్ వేయగా ఆయన వైసీపీ గూటికి చేరారు. కాగా 29వ వార్డులో అభ్యర్థి నామినేషన్ను సాంకేతిక కారణాలతో తొలగించారు. ఇక్కడ ఏమీ చేయాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తుంది.
వైసీపీ.. అభ్యర్థులు
తర్జనభర్జనల అనంతరం ప్రకటన
రూరల్ మండల పరిధిలోని డివిజన్లపై సస్పెన్స్
గుంటూరు, మార్చి 2: నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ కార్పొ రేటర్ అభ్యర్థుల జాబితాను నాయకులు ప్రకటించారు. తర్జనభర్జనల అనంతరం మంగళవారం రాత్రికి దాదాపుగా ఖరారు చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 23 డివిజన్లకు అభ్యర్థుల పేర్లు మూడు రోజులు ముందుగానే ఖరారయ్యాయి. పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో నాలుగు డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదు. ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని 48వ డివిజన్ వైసీపీ అభ్యర్థి తనుబుద్ధి కృష్ణారెడ్డి గెలుపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. మిగతా ఏడు డివిజన్లలో ఒకటి రెంటింటికి సంబంధించి మినహా మిగతా స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ పూర్తి జాబితాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గ పరిధికి చెందిన నాయకులు ఎవరికి వారు తమ వర్గీయుల పేర్లును ఖరారు చేసుకునేందుకు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆయా డివిజన్ల అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం.