రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
ABN , First Publish Date - 2021-10-23T06:30:06+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాక్షస, ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు.
- పిఠాపురంలో కళ్లకు గంతలతో టీడీపీ నేతల నిరసన
పిఠాపురం, అక్టోబరు 22: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాక్షస, ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్సఎన్ వర్మ విమర్శించారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి సృష్టించిన విధ్వంసానికి నిరసనగా వర్మ, ఇతర పార్టీ నేతలు కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన నిర్వహించారు. మునిసిపల్ కార్యాలయంవద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అవినీతి అక్రమాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో భ్రష్టుపట్టిన పాలనను, ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి ప్రజలకు న్యాయం చేయాలని గాంధీని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే జైల్లో పెడుతున్నారని చెప్పారు. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిరసనలో టీడీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి కొండేపూడి ప్రకాష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నల్లా శ్రీను, నాయకులు కొరుప్రోలు శ్రీనివాస్, కరణం చిన్నారావు, పిల్లి చిన్నా, కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనుబాబు, నామా దొరబాబు, చవ్వాకుల రామచంద్రరావు, సోము సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.