ఏపీలో మహిళలకు రక్షణ లేదు: అనిత

ABN , First Publish Date - 2020-12-03T21:44:34+05:30 IST

అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మహిళా నేత అనిత ఆరోపించారు. విజయవాడలో టీడీపీ మహిళా కార్యాలయం ప్రారంభోత్సవంలో అనిత, బోండా ఉమ పాల్గొన్నారు

ఏపీలో మహిళలకు రక్షణ లేదు: అనిత

విజయవాడ: అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని టీడీపీ మహిళా నేత అనిత ఆరోపించారు. విజయవాడలో టీడీపీ మహిళా కార్యాలయం ప్రారంభోత్సవంలో అనిత, బోండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ‘ప్రస్తుతం ప్రతిరోజూ ఒక అత్యాచారం, వారానికో హత్యగా రాష్ట్రంలో పరిస్థితి ఉంది. పశువులను కోసినట్లుగా ఆడపిల్లలను చంపేస్తున్నారు. వైజాగ్‌లో ఒక ఉన్మాది ఆడపిల్ల గొంతు కోస్తే నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఇంకో ఉన్మాది మరో ఆడపిల్ల గొంతు కోశాడు. రాష్ట్రానికి హోంమంత్రిగా మహిళను నియమించానని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి... జరుగుతున్న అమానుషాలను చూసి సిగ్గుపడాలి’ అని ధ్వజమెత్తారు.


‘ఆడపిల్లలకు మేనమామనని చెప్పిన జగన్.. దిశా యాక్ట్ ప్రవేశపెట్టాక అఘాయిత్యాలు పెరిగాయి. అయినా సిగ్గులేకుండా దిశా యాక్ట్‌కు మూడు అవార్డులు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇంకా చట్టబద్ధత కానీ దిశా యాక్ట్‌కు అవార్డులు ఎలా వస్తున్నాయి. అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగగలిగితే స్వాతంత్ర్యం అన్నారు. ఏపీలో ఆడపిల్లకు బయట కాదు క‌దా.. ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీని విమర్శించేందుకు మాత్రమే మహిళా కమిషన్ ఒకసారి మెరుపుతీగలా వస్తుంది. అసలు రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందో.. లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా హోంమంత్రి కళ్లు తెరిచి మహిళలపై జరుగుతున్న దారుణాలను అరికట్టాలి’ అని అనిత డిమాండ్ చేశారు.


బోండా ఉమ..

18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు శాంతి భద్రతలను కాపాడటంలో పూర్తిగా వైఫల్యం చెందిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ఆడపిల్లలపై దాడులు పెరిగాయన్నారు. చంద్రబాబు హయాంలో రౌడీలు రాష్ట్రంలో ఉండటానికే భయపడేవారని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో రౌడీలు రోడ్లపై పడి యధేచ్ఛగా బీభత్సాలు చేస్తున్నారన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని రాష్ట్రంగా ఏపీ రికార్డుకెక్కిందని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-12-03T21:44:34+05:30 IST