500లోపు టీడీఎస్ ఉన్నచోట్ల ఆర్వోలపై నిషేధం విధించండి
ABN , First Publish Date - 2021-12-04T06:36:02+05:30 IST
నీటి గాఢత (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్-టీడీఎస్) లీటరుకు 500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉన్న చోట్ల వాటర్ ..
కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం
న్యూఢిల్లీ, డిసెంబరు 3: నీటి గాఢత (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్-టీడీఎస్) లీటరుకు 500 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉన్న చోట్ల వాటర్ ప్యూరిఫయర్ల వాడకాన్ని నిషేధించాలని, ఈ మేరకు ప్యూరిఫయర్ల తయారీదారులకు ఆదేశాలివ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ కేంద్ర కాలుష్యనియంత్రణ మండలిని ఆదేశించింది. ఈ ఆదేశాలు నెలరోజుల్లోగా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. రివర్స్ ఆస్మాసిస్ ప్యూరిఫయర్ల వినియోగం వల్ల జరుగుతున్న నీటి వృథాని అరికట్టాలంటూ ఫ్రెండ్స్ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అలాగే, ఆర్వో వాటర్ ప్యూరిఫయర్లకు అనుమతులిచ్చిన చోట వృథా అయ్యే నీటిలో 60 శాతానికి పైగా రికవర్ చేయడం తప్పనిసరి చేయాలని పేర్కొంది. ఆ నీటిని అంట్లు తోమడానికి, మొక్కలకు, ఇతర పనులకు వాడేలా చూడాలని పేర్కొంది.