రోజుకు రెండు లేదా మూడు కప్పులకు మించి టీ తాగితే..
ABN , First Publish Date - 2020-06-15T17:24:43+05:30 IST
టీ మంచిదేనా? రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడానికి తేనీరు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
ఆంధ్రజ్యోతి(15-06-2020)
ప్రశ్న: టీ మంచిదేనా? రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడానికి తేనీరు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
- రేణుక, బెంగళూరు
డాక్టర్ సమాధానం: టీని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. బ్లాక్ టీ, గ్రీన్ టీలు ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఈ రెండు రకాల టీ లు ఒకటే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీలో కెఫెయిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. తేనీటిలో ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పోలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్స్గా పని చేసి మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ గా కాకుండా పాలతో పాటు తీసుకుంటే పాలలోని కేసిన్ తేనీటిలోని ఫ్లేవనాయిడ్స్ శరీరానికి అందకుండా చేస్తాయి. అందువలన టీ యొక్క ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో పాలు, చక్కర కలపకుండా తీసుకోవడం మంచిది. అంతే కాకుండా, రోజుకు రెండు లేదా మూడు కప్పులకు మించి టీ తాగితే రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంది. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి టీ లాభదాయకమే.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)