టీచర్ల బదిలీల్లో చోద్యం

ABN , First Publish Date - 2020-12-01T06:16:41+05:30 IST

టీచర్ల బదిలీల్లో రోజుకో సిత్రం బయటపడుతోంది. డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌లో అరుదైన రోగాన్ని రాసుకుని, ఓ మహిళా ఎస్‌జీటీ లబ్ధి పొందాలని చూసింది. దీనిపై విచారణ చేయించిన డీఈఓ శామ్యూల్‌.. ఆమె ఫోర్జరీకి పాల్పడిందని తేలటంతో సోమవారం సస్పెండ్‌ చేశారు.

టీచర్ల బదిలీల్లో చోద్యం

మెడికల్‌ సర్టిఫికెట్‌ ఫోర్జరీ

మహిళా ఎస్‌జీటీపై సస్పెన్షన్‌ వేటు

అనంతపురం విద్య, నవంబరు 30: టీచర్ల బదిలీల్లో రోజుకో సిత్రం బయటపడుతోంది. డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌లో అరుదైన రోగాన్ని రాసుకుని, ఓ మహిళా ఎస్‌జీటీ లబ్ధి పొందాలని చూసింది. దీనిపై విచారణ చేయించిన డీఈఓ శామ్యూల్‌.. ఆమె ఫోర్జరీకి పాల్పడిందని తేలటంతో సోమవారం సస్పెండ్‌ చేశారు. ఉపాధ్యాయ బదిలీల్లో చిత్రవిచిత్రాలు బయటపడుతున్నాయి. ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ కేటగిరీలో లబ్ధి పొందేందుకు చాలామంది నాయకులు, టీచర్లు కొత్తకొత్త మార్గాలను వెతుకున్నారు. ఈ క్రమంలో కంబదూరు మండలం ఐపార్సుపల్లి పాఠశాలలో పనిచేసే ఓ మహిళా ఎస్‌జీటీ మెడికల్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ తీసుకుంది. డాక్డర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌లో వ్యాధి పేరు రాయకున్నా.. ‘మస్క్యూలర్‌ డిస్ర్టోఫీ’ అనే వ్యాధి ఉన్నట్లు సొంతంగా రాసుకుంది. దీనిపై డీఈఓ శామ్యూల్‌ విచారణ చేయించారు. డాక్టర్‌ ఇచ్చిన దానికి, వీరి వద్ద ఉన్న సర్టిఫికెట్‌కు తేడా స్పష్టంగా ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. దీంతో సదరు మహిళా టీచర్‌ను సస్పెండ్‌ చేస్తూ.. డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.


అక్రమాలకు సంకెళ్లు

ఇప్పటికే ఓ సంఘం నాయకుడిపై డీఈఓ ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జస్‌ ఫ్రేం చేశారు. తాజాగా మరో మహిళా టీచర్‌ను సస్పెండ్‌ చేశారు. బదిలీల్లో మరికొందరు నాయకులు, టీచర్లు సైతం ప్రిఫరెన్సియల్‌, స్పౌజ్‌ కేటగిరీల్లో అక్రమ మార్గాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇలాంటి వారిపై డీఈఓ కొరడా ఝుళిపిస్తున్నారు. మెడికల్‌ బోర్డు జారీ చేసిన వాటిపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై కూడా లోతైన దర్యాప్తు చేయిస్తే.. మరిన్ని అక్రమాలు బయట పడతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 49 దరఖాస్తులను తిరస్కరించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సంఘాల నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా.. అక్రమాలకు పాల్పడిన వారిపై డీఈఓ చర్యలకు సిద్ధమయ్యారు. మరికొందరిపై వేటు పడనున్నట్లు సమాచారం.

Updated Date - 2020-12-01T06:16:41+05:30 IST