కరోనా కల్లోలంలో వెరైటీ స్కూల్...

ABN , First Publish Date - 2021-03-29T22:45:58+05:30 IST

కరోనా వైరస్ కారణంగా స్కూళ్లన్నీ మూతపడడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు పాఠాలు బోధించేందుకు ..

కరోనా కల్లోలంలో వెరైటీ స్కూల్...

ముంబై: కరోనా వైరస్ కారణంగా స్కూళ్లన్నీ మూతపడడంతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు పాఠాలు బోధించేందుకు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఓ స్కూటీని మొబైల్ స్కూల్‌గా, లైబ్రరీగా మార్చేసి.. చెట్ల నీడలో ఓ మైక్ పట్టుకుని ఔట్ డోర్ ‌క్లాసులు నిర్వహిస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో చంద్ర శ్రీవాస్తవ చేస్తున్న ఈ క్లాసులు చూసి విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేశారు. పిల్లల కోసం రోజూ క్లాసులు తీసుకుంటున్న చంద్ర శ్రీవాస్తవకు ఓ పేరెంట్ కృతజ్ఞతలు తెలిపారు. స్కూటీకి ఓ పక్క గ్రీన్ బోర్డు కూడా ఏర్పాటు చేసుకున్న ఆయన.. మరోపక్క చిన్నపాటి లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని పుస్తకాలను ఉచితంగా ఇస్తుండగా.. మరికొన్ని పుస్తకాలకు చదువుకుని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.


కాగా ఆరో తరగతి  చదువుతున్న కేశవ్ మాట్లాడుతూ.. ‘‘కరోనా సంక్షోభం సమయంలో కూడా సార్ ఇక్కడికి వచ్చారు. గణితం ఇతర సబ్జెక్టులు కూడా బోధిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. కాగా చంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘‘ వీరిలో చాలా మంది విద్యార్ధులు అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారు. వాళ్లు కనీసం స్మార్ట్ ఫోన్లు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆన్‌లైన్ తరగతులు వారికి చేరడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం లేదు. నేను ఆ పాఠాలను డౌన్‌లోడ్ చేసి, నా ఫోన్‌లోనే వారికి చూపిస్తాను...’’అని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-29T22:45:58+05:30 IST