పీఆర్సీ జీవోలపై భగ్గుమన్న ఉపాధ్యాయులు
ABN , First Publish Date - 2022-01-19T06:26:02+05:30 IST
పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం రాత్రి ఇక్కడ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.
నర్సీపట్నంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ
నర్సీపట్నం, జనవరి 18: పీఆర్సీ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, పింఛను, డీఏలకు సంబంఽధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు నిరసనగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం రాత్రి ఇక్కడ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి నుంచి అబీద్ సెంటర్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు. పీఆర్సీ జీవో ఉపసంహరించుకోవాలని, హెచ్ఆర్ఏ పాత శ్లాబ్నే కొనసాగించాలని, 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని, సీపీఎస్ రద్దు చేయాలని, గ్రాట్యూటీని రూ.20 లక్షలకు పెంచాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డీజీ నాథ్, నాయకులు అడిగర్ల వరహాలనాయుడు, అల్లు అప్పారావు, ఎంఎస్ ప్రసాద్, సుగుణ, బీవీ రమణ, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ జీవో ప్రతులు దహనం
కృష్ణాదేవిపేట, జనవరి 18: వేతన సవరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ గొలుగొండ మండలం ఏఎల్పురం హైస్కూల్లో ఏపీటీఎఫ్ నాయకులు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా జీవో కాపీలను దహనం చేశారు. ఏపీటీఎఫ్ నాయకుడు సిహెచ్.నరసింహమూర్తి మాట్లాడుతూ, అశుతోష్ మిశ్రా నివేదికను బహిర్గతం చేయాలని, ఫిట్మెంట్ని 30 శాతానికి మించి ఇవ్వాలని, హెచ్ఆర్ఏ పాత శ్లాబులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లచ్చు, టీవీ రమణ, రామరాజు, భారతి తదితరులు పాల్గొన్నారు.
నాతవరంలో...
నాతవరం జనవరి 18: పీఆర్సీపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ కూండ్రపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సాయంత్రం ఇక్కడ జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిట్మెంట్ 30 శాతానికిపైగా ఉండాలని, హెచ్ఆర్ఏ పాతశ్లాబ్ లనే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.జగన్నాఽథరావు, అప్పన్నబాబు, ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.