ఉపాధ్యాయులు విధులకు రావాల్సిందే..!

ABN , First Publish Date - 2021-04-21T05:48:03+05:30 IST

కరోనా తీవ్రత దృష్ట్యా పాఠశాలలను మూసివేయాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను మాత్రం పాఠశాల విధులకు హాజరు కావాల్సిందేనని సూచించింది.

ఉపాధ్యాయులు  విధులకు రావాల్సిందే..!

చిత్తూరు, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత దృష్ట్యా పాఠశాలలను మూసివేయాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను మాత్రం పాఠశాల విధులకు హాజరు కావాల్సిందేనని సూచించింది. 1-9 తరగతుల నిర్వహణను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే యథావిధిగా 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ నుంచి అన్ని మండల విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని అన్ని రకాల పాఠశాలల్లో 25,742 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గతేడాది, ఈ ఏడాది కరోనా తీవ్రతతో పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థుల్లో నెలకొన్న ప్రతిభా సామర్థ్యాలు తెలియకుండా పోతున్నాయి. అయితే ప్రస్తుత ఏడాదిలో మాత్రం ఇప్పటివరకు పాఠశాల స్థాయిలో జరిగిన పరీక్షలను ప్రాతిపదికగా చేసుకుని వారి ప్రతిభను గుర్తించే అవకాశం ఉందని, అందుకు సంబంధించి ఉన్నత స్థాయిలో కసరత్తు చేసి ఒకటి రెండు రోజుల్లోనే జిల్లాలకు ఆదేశాలు పంపే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఉపాధ్యాయులను విధులకు హాజరు కావాలని సూచించడం వెనుక అసలు కారణం ఇదేనని చెబుతున్నారు. మరోవైపు పిల్లలకు వార్షిక పరీక్షల నిర్వహణకు వీలుగా డీసీఈబీ ప్రశ్నపత్రం సిద్ధం చేసింది. గతేడాది కూడా వీటిని సిద్ధం చేసింది. అయితే రెండేళ్లు పరీక్షలు జరగకపోవడంతో వాటిని తిరిగి ఎలా వినియోగించుకుంటారో చూడాల్సి ఉంది. పిల్లల ప్రతిభా సామర్థ్యాలను అంచనా వేయడం, వారిని పైతరగతులకు ప్రమోట్‌ చేయడం వంటి అంశాలపై ఇంకా మార్గదర్శకాలు రాలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తరగతులవారీగా పిల్లల్లో నెలకొన్న అభ్యసన సామర్థ్యాలు, ఇప్పటికే నిర్వహించిన స్లిప్‌ టెస్ట్‌ల ఆధారంగా నివేదికలు తయారుచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, అందుకే వారు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


Updated Date - 2021-04-21T05:48:03+05:30 IST