పీఆర్సీ ఉత్తర్వులు వెంటనే రద్దుచేయాలి
ABN , First Publish Date - 2022-01-19T06:28:02+05:30 IST
అసంబద్ధమైన పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంగళవారం స్థానిక గౌతమ్ సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
ఉపాధ్యాయులు డిమాండ్
జీవో ప్రతులు దహనం చేసి నిరసన
పాయకరావుపేట, జనవరి 18: అసంబద్ధమైన పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంగళవారం స్థానిక గౌతమ్ సెంటర్లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఈనెల 20వ తేదీన కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం పీఆర్సీ ఉత్తర్వుల కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గణేశ్, రామ్రహీమ్, కిల్లాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణరాజు, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లిలో....
నక్కపల్లి: మధ్యంతర భృతి(ఐఆర్) కన్నా పీఆర్సీలో ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం, హెచ్ఆర్ ఏలో భారీ కోతను నిరసిస్తూ నక్కపల్లిలో ఉపాధ్యా యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు దాడిశెట్టి కొండలరావు, చొక్కా అప్పలరాజు, కేఎస్ఎస్ సాయి ప్రసాద్, రాజేశ్, సురేశ్ కుమార్, రవి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.