HYD : ‘సమయపాలన’పై టీచర్ల కొట్లాట.. ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణ.. సహనం కోల్పోయి..!
ABN , First Publish Date - 2021-12-03T16:42:59+05:30 IST
గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు...
హైదరాబాద్ సిటీ : గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరంగం సృష్టించారు. తాము పనిచేస్తున్న పాఠశాలలో ఒకరిపై మరొకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. ఒక దశలో సహనం కోల్పోయి దాడిచేసుకునేంతవరకు వెళ్లారు. తోటి టీచర్లు ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లి శాంతింపచేశారు. నగర పరిధిలోని కేశవగిరి ప్రాథమిక పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు కొంతకాలంగా వేళలు పాటించకుండా హాజరవుతున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం పది గంటల తర్వాత స్కూల్కు వచ్చిన సదరు టీచర్ను ఇన్చార్జి హెచ్ఎం నిలదీశారు. వేళకు హాజరుకాకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది.
స్టాఫ్రూమ్లో గట్టిగా అరుచుకోవడంతోపాటు ఒకరినొకరు నెట్టేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీచర్లు అక్కడికి చేరుకుని ఇద్దరిని పక్కకు తీసుకెళ్లారు. కాగా, గొడవ అనంతరం ఆలస్యంగా వచ్చిన టీచర్ సంతకం చేసి మళ్లీ బయటకు వెళ్లినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ఈ విషయాన్ని మండల విద్యాశాఖాధికారులు డీఈఓకు వివరించారు. దీంతో గొడవపడిన ఇద్దరినీ వేర్వేరు స్కూళ్లకు డిప్యూటేషన్పై పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, ఇన్చార్జి హెచ్ఎంతో ఘర్షణపడిన సదరు ఉపాధ్యాయుడు గతంలో ఓ ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఓ ఉపాధ్యాయ సంఘం నేతగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.