నేటినుంచి టీచర్ల బదిలీలు
ABN , First Publish Date - 2020-11-28T07:49:41+05:30 IST
టీచర్ల బదిలీల ప్రక్రియను ఎట్టకేలకు శనివారం నుంచి ప్రారంభించనున్నారు
ఇప్పటికే రెండుసార్లు వాయిదా
చిత్తూరు (సెంట్రల్), నవంబరు 27: కొవిడ్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన టీచర్ల బదిలీల ప్రక్రియను ఎట్టకేలకు శనివారం నుంచి ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,435 మంది టీచర్లుండగా, 7,861 మంది ఆన్లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒకేచోట ఎనిమిదేళ్లపాటు పనిచేసిన 2,202 మంది టీచర్లు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. 5,659 మంది టీచర్లు రిక్వెస్టు బదిలీ పెట్టుకున్నారు.
షెడ్యూల్ ఇలా.. : బదిలీ జాబితా దరఖాస్తులను ఈనెల 28,29 తేదీల్లో డీఈవో కార్యాలయంలో మరోసారి పరిశీలిస్తారు. టీచర్లకు వచ్చిన సర్వీసు పాయింట్ల ఆధారంగా ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాను ఈనెల 30 నుంచి డిసెంబరు రెండో తేదీవరకు ఆన్లైన్లో ఉంచుతారు. సదరు జాబితాపై అభ్యంతరాలుంటే డిసెంబరు 3,4 తేదీల్లో డీఈవో కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సంబంధిత డాక్యుమెంట్లతో సమర్పించాల్సి ఉంది. వీటిని ఇదే గడువులో పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత సిద్ధం చేసిన జాబితాను (అభివృద్ధి) వీరబ్రహ్మంకు నివేదిస్తారు. 5, 6, 7 తేదీల్లో ఆయన పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంది. పాయింట్ల ఆధారంగా 8,9,10 తేదీల్లో సీనియారిటీ జాబితా ఆన్లైన్లో ఉంచుతారు. 11 నుంచి 15 వరకు దరఖాస్తు చేసిన వారికి వెబ్ ఆప్షన్ అవకాశం ఇస్తారు. 16 నుంచి 21 వరకు బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్లో ఉంచుతారు. 22,23 తేదీల్లో బదిలీ ఉత్తర్వుల్లో సాంకేతిక అవరోధాలుంటే పరిష్కరిస్తారు. డిసెంబరు 24న బదిలీ ఉత్తర్వులు ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆయా పాఠశాలల్లో విధులకు టీచర్లు హాజరు కావాలి.