తీన్మార్‌ మల్లన్న అరెస్టు

ABN , First Publish Date - 2021-08-28T09:01:45+05:30 IST

‘క్యూ న్యూస్‌’ సీఈఓ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

తీన్మార్‌ మల్లన్న అరెస్టు

  • ఉప్పల్‌లోని నివాసం నుంచి తీసుకెళ్లిన పోలీసులు

బౌద్ధనగర్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ‘క్యూ న్యూస్‌’ సీఈఓ తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను చిలకలగూడ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఉప్పల్‌లోని మల్లన్న నివాసం నుంచి పోలీసులు ఆయనను తీసుకెళ్లారు. తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని మారుతీ జ్యోతిష్యాలయ నిర్వాహకుడు సన్నిదానం లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈనెల 3వ తేదీన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన పోలీసులు.. 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరారు.


కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని న్యాయవాది ద్వారా సమాచారం పంపిన మల్లన్న విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు. తన వద్ద నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏప్రిల్‌ 22న లక్ష్మీకాంత్ శర్మ.. చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెట్టారని, అరెస్టు చేశారని, దీనిపై న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని మల్లన్న ప్రకటించారు. 

Updated Date - 2021-08-28T09:01:45+05:30 IST