ఈ తాడు కోసమే BJPలో చేరా: తీన్మార్ మల్లన్న

ABN , First Publish Date - 2021-12-07T18:40:31+05:30 IST

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో మంగళవారం తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ తాడు కోసమే BJPలో చేరా: తీన్మార్ మల్లన్న

న్యూఢిల్లీ: జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ మంగళవారం బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర నేతల సమక్షంలో తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. మల్లన్నకు తరుణ్ చుగ్ సభ్యత్వ రసీదు ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..‘‘నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు.. 15 మీటర్ల తాడు. ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావును కట్టేస్తా. అమరవీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలోనే అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే నేను ఢిల్లీకి వచ్చా. నాపై 38 కేసులు పెట్టారు. అయినా ఏం సాధించారు?. పోలీసులు బాధపడ్డారు, జడ్జీలు మదనపడ్డారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి కేసీఆర్‌పై పోరాడతాం.’’ అని తెలిపారు. 


తరుణ్ చుగ్ మాట్లాడుతూ..‘‘సమస్యలపై పోరాడే నవీన్ కుమార్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నాం. దేశంలో మార్పు రావాలంటే కలం ఎత్తాల్సిందే. కేసీఆర్ దోపిడీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నవీన్ కుమార్ కలం ఎత్తారు. తెలంగాణా యువత తీన్మార్ మల్లన్న లైవ్ కోసం ఎదురు చూస్తుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓట్లు సాధించారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలు యాత్రలు చేస్తుంటే అధికార పార్టీ దాడులు చేస్తూ, కేసులు పెడుతోంది. ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది.’’ అని మండిపడ్డారు.



Updated Date - 2021-12-07T18:40:31+05:30 IST