తహసీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేయాలి
ABN , First Publish Date - 2021-07-30T05:11:02+05:30 IST
హుకుంపేటలో ఆదివాసీ మహిళకు సంబంధించిన షాపును కూల్చిన తహసీల్దార్, వీఆర్వోలను తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
ఛలో ఐటీడీఏలో అఖిలపక్షం నాయకుల డిమాండ్
పాడేరురూరల్, జూలై 29: హుకుంపేటలో ఆదివాసీ మహిళకు సంబంధించిన షాపును కూల్చిన తహసీల్దార్, వీఆర్వోలను తక్షణమే సస్పెండ్ చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఛలో ఐటీడీఏ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో, సబ్కలెక్టర్, అరకు ఎమ్మెల్యే, ఎంపీల మొండివైఖరిని నిరసిస్తూ గురువారం ఛలో ఐటీడీఏ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఆదివాసీ మహిళకు అన్యాయం జరిగిందని 30 రోజులుగా నిరాహార దీక్ష చేపడితే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఫాల్గుణ, ఎంపీ మాధవి స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి షాపును కూల్చిన తహసీల్దార్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, షాపు నిర్మాణానికి రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన తహసీల్దార్, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని, షాపు కూల్చినందుకు నష్టపరిహారం ఇప్పించాలని, ఆదివాసేతరుల అక్రమ నిర్మాణాలపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళకు అన్యాయం చేసిన తహసీల్దార్, వీఆర్వోలపై చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్షనాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు రామారావుదొర, గంగరాజు, టి.కృష్ణారావు, కె.రాధాకృష్ణ, పి.శాంతకుమారి, శెట్టి లక్ష్మణుడు, లక్ష్మణరావు, కొండలరావు, రామారావు, సింహాద్రి, సింహాచలం, లలితకుమారి, నానమ్మ, సూర్యమణి, గోపాల్ పాల్గొన్నారు.